మంచు చరియలు విరిగిపడి 10 మంది మృతి: హిమపాతంలోనే మరికొందరు, రెస్క్యూ ఆపరేషన్స్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీ జిల్లాలోని మౌంట్ ద్రౌపది కా దండా - II శిఖరం వద్ద మంగళవారం మంచు చరియలు విరిగిపడి పది మంది పర్వతారోహకులు మరణించారని అధికారులు తెలిపారు. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)కి చెందిన 34 మంది ట్రైనీ పర్వతారోహకులు, ఏడుగురు బోధకులు తిరిగి వస్తుండగా హిమపాతంలో చిక్కుకున్నారని ఎన్ఐఎం ప్రిన్సిపల్ కల్నల్ అమిత్ బిష్త్ తెలిపారు.
పది మృతదేహాలు కనిపించాయని, అందులో నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఈ శిఖరం ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాలలోని గంగోత్రి శ్రేణిలో ఉంది.
మంగళవారం ఉదయం 8.45 గంటలకు హిమపాతం సంభవించిందని సదరు అధికారి తెలిపారు. చిక్కుకున్న వారిలో ఎనిమిది మందిని తమ బృందం సభ్యులు రక్షించారని ఉత్తరకాశీ విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ తెలిపారు.
ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ మిశ్రా మాట్లాడుతూ.. ద్రౌపది దండా-2 పర్వత శిఖరంపై నిరంతరం భారీ మంచు కురుస్తోంది. అయినప్పటికీ.. ఎన్ఐఎం పర్వతారోహణ ట్రైనీలను రక్షించడానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Uttarakhand | SDRF teams leave from Sahastradhara helipad in Dehradun to rescue the trainees trapped in an avalanche in Draupadi's Danda-2 mountain peak pic.twitter.com/kYRRgLAwwh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 4, 2022
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రమాదంపై స్పందించారు. 'ఉత్తరకాశీలో హిమపాతం సంఘటన చాలా బాధాకరమైనది, ఈ విషయంలో నేను అధికారులతో మాట్లాడాను. స్థానిక పరిపాలన, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ బృందాల సహాయక చర్యల్లో పూర్తి సంసిద్ధతతో నిమగ్నమై ఉన్నాయి అని అమిత్ షా తెలిపారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, ఎన్ఐఎంకు చెందిన పర్వతారోహకుల బృందం సహాయక చర్యలు ప్రారంభించాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ముఖ్యమంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయడంలో సైన్యం సహాయం కోరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితో ఘటనపై రక్షణ మంత్రి మాట్లాడారు. సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల సహాయం అందిస్తామని చెప్పారు.