అయోధ్య కేసులో చివరి అంకం: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో భిన్న వైఖరి
న్యూఢిల్లీ: మరో మూడు రోజులు. అత్యంత సున్నితమైన, అదే స్థాయి వివాదాస్పదమైన అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తన అంతిమ విచారణను ముగించబోతోంది. తదనంతరం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై 70 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో నలుగుతోన్న కేసుపై తుది విచారణను ముగిస్తామని, ఇకపై ఎలాంటి వాదోపవాదాలు ఉండబోవని సుప్రీంకోర్టు అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అందరి దృష్టీ వారిపై కేంద్రీకృతమైంది.
అయోధ్య కేసు: సుప్రీం విధించిన గడువులోగా వాదనలు ముగియకుంటే పరిస్థితేంటి..?
70 ఏళ్ల నాటి కేసు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వం వహిస్తోన్న అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ ఎస్ ఏ బొబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ అయిదుమంది ఉమ్మడిగా రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదానికి సంబంధించిన కేసులను విచారిస్తున్నారు. రెండు నెలల పాటు, 37 దఫాలుగా ఈ కేసుపై విచారణ కొనసాగింది. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. గురువారం నాటితో దీనిపై విచారణ పర్వానికి పుల్ స్టాప్ పడబోతోంది. అనంతరం తీర్పును వెలువడిస్తుంది ఈ ధర్మాసనం.
ఒక్కొక్కరిది ఒక్కో శైలి..
అయిదుమంది న్యాయమూర్తుల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సున్నితమైన, కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల విచారణ సందర్భంగా వినూత్న విధానాలను అనుసరించారు. ప్రధాన కేసుకు అనుబంధంగా దాఖలైన ప్రతి చిన్న పిటీషన్ ను కూడా విచారణకు స్వీకరించారు. ఏ ఒక్క దాన్ని కూడా తిరస్కరించిన సందర్భాలు లేవు. తమ అభిప్రాయాలను వినిపించడంలో కక్షిదారులకు స్వేచ్ఛ నిచ్చారు. ఎన్ని సార్లయినా తమ అభిప్రాయాలను వినిపించుకోవచ్చని ముందే సూచించారు. కేసుపై విచారించే న్యాయవాదులకు వారి అభిప్రాయాలను నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వెల్లడించాలని సూచించారు.
ఫుల్ బెంచ్ హాజరు..
కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఫుల్ బెంచ్ హాజరు కావడం మరో ప్రత్యేకత. అయోధ్య కేసులో ప్రధాన కక్షిదారులుగా ఉన్న రామ్ లల్లా విరాజమాన్, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు వినిపించిన ప్రతి చిన్న అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయోధ్య భూ వివాదం కేసులో ఈ మూడు సంస్థలే ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు ఈ మూడు సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ.. ఎవ్వరు కూడా వారి వైఖరి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు.
పురావస్తు శాఖ నివేదిక చుట్టే..
ఇదివరకు అలాహాబాద్ న్యాయస్థానం ఇచ్చిన ఆరువేల పేజీల తీర్పు విషయంలో పురావస్తు శాఖ నివేదిక కీలక పాత్ర పోషించింది. శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంగా భావిస్తోన్న రామ్ చబుత్రపై పురావస్తు శాఖ అధికారులు ఇచ్చిన నివేదికే కీలకం. దీనికి సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన ప్రతీసారీ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని అయిదుమంది న్యాయమూర్తులు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు అసాధారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పురావస్తు శాఖ నివేదిక ఆధారమే తప్ప.. కళ్లతో చూసిన వారెవరూ లేరని, ఆ నివేదికను విశ్వసించక తప్పదని చెబుతూ వచ్చారు.