అయోధ్య కేసు: సుప్రీం విధించిన గడువులోగా వాదనలు ముగియకుంటే పరిస్థితేంటి..?
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో వాదనలకు చివరి తేదీగా అక్టోబర్ 18న సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లోగ వాదనలు పూర్తయితే మరో నెలరోజుల సమయంలో అయోధ్య భూవివాదంపై తీర్పు వెలువడుతుంది. ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నవంబర్ 17న పదవీవిరమణ పొందుతున్నారు. ఆలోగా వాదనలు ముగియకుంటే పరిస్థితి ఏమిటి..?
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు
కొన్నేళ్లుగా అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదం కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక సుప్రీం కోర్టుకు ఈ పంచాయతీ చేరడంతో రోజువారీ వాదనలు వినేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యకు సంబంధించిన అన్ని వాదనలు అక్టోబర్ 18కల్లా ముగించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ డెడ్లైన విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ వాదనలు ముగిస్తే ఫర్వాలేదు. ముగియకుంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది.
నవంబర్ 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవీవిరమణ పొందనున్నారు. అయితే ఆలోగ అయోధ్య కేసులో తీర్పు చెప్పాలని భావిస్తున్నారు. ఒకవేళ వాదనలు అక్టోబర్ 18కల్లా ముగియకుంటే మళ్లీ కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసి కేసును మొదటి నుంచి వినాల్సి ఉంటుంది. అక్టోబర్ 18న వాదనలు ముగిస్తే చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యేందుకు మరో నెలరోజుల సమయం ఉన్నందున ఆలోగా కేసును మొత్తం స్టడీ చేసి తీర్పు చెప్పే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు లాయర్ అతుల్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే అయోధ్య కేసుతో పాటు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు భూసేకరణ కేసుతో పాటు ఇతర కేసులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుందని అతుల్ చెబుతున్నారు.
2011లో సుప్రీంకోర్టుకు చేరిన అయోధ్య కేసు
ఆగష్టు 6 నుంచి రోజువారీగా అయోధ్య భూవివాదం కేసులో దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. 2011లో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక అప్పటి నుంచి వాదనలు వింటూనే ఉన్నారు. తీర్పు చెప్పాల్సిన జడ్జీలు పదవీవిరమణ పొందుతుండటంతో కేసు మళ్లీ మొదటికి వస్తోంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
2017లో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు
వివాదంగా మారిన 2.77 ఎకరాలను రామ్లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్బోర్డుల మద్య సమానంగా పంచాలని అలహాబాదు హైకోర్టు 2010లో తీర్పు చెప్పింది. అయితే అయోధ్య కేసులో కావాలనే కోర్టులు జాప్యం చేస్తున్నాయని బీజేపీతో పాటు ఇతర హిందూ సంఘాలు ఆరోపణలు చేశాయి. 2011లో సుప్రీంకోర్టుకు చేరినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆసక్తి కనబర్చనందునే జాప్యం జరిగిందని బీజేపీ విమర్శించింది. 2017లో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కావడంతో అయోధ్య కేసు విచారణలో వేగం పుంజుకుంది. 2017లో విచారణ జరుగుతున్న సమయంలో 2019 లోక్సభ ఎన్నికలు ముగిసేవరకు కేసును విచారణ చేపట్టరాదని ముస్లిం పార్టీల తరపున వాదించిన సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ కోర్టును కోరగా ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.
ఫలించని మధ్యవర్తిత్వం
గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన అయోధ్య భూవివాదం కేసులో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న రిటైర్ అయ్యారు. 2018 అక్టోబర్ 29 నుంచి త్రిసభ్య ధర్మాసనం అయోధ్య కేసును విచారణ చేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే మధ్యలో మళ్లీ బ్రేక్ పడింది. మధ్యవర్తుల సమక్షంలో కేసును పరిష్కరించాలంటూ మధ్యవర్తులుగా ఇబ్రహీం ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిశంకర్, సీనియర్ లాయర్ శ్రీరాం పంచులను సుప్రీంకోర్టు నియమించింది. ఈ ఏడాది ఆగష్టు 15కల్లా నివేదిక సమర్పించాలని కోరింది. అయితే మధ్యవర్తిత్వం విఫలమవడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది.
వాదనలు ముగుస్తాయా లేక...
సాధారణంగా అమెరికా న్యాయవ్యవస్థలో కానీ బ్రిటన్ న్యాయవ్యవస్థలో కానీ వాదనలు ముగిసేందుకు గడువు విధిస్తారని ఆ గడువులోగా వాదనలు ముగించడం వల్ల కేసు పరిష్కారం త్వరతగతిన పూర్తవుతుందని అతుల్ కుమార్ చెప్పారు. ఒకవేళ అలా జరగకుంటే కేసులో మళ్లీ మొదటి నుంచి వాదనలు వినాల్సి ఉంటుందని దీనివల్ల సమయం వృథా అవుతుందని అతుల్ తెలిపారు. సుప్రీంకోర్టు దసరా, దీపావళి పండుగల సందర్భంగా పనిచేయదు అదే సమయంలో శనివారాలు కూడా ఉండటంతో మొత్తం 15రోజులు కోర్టులకు సెలవు దినాలుగా ఉన్నాయి. అయితే అయోధ్య కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తాను పదవీవిరమణ పొందేలోగా ఒక చారిత్రాత్మక తీర్పు ఇస్తారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది.