Ayodhya verdict: అయోధ్యపై తీర్పు: రైల్వే స్టేషన్లలో కనీవినీ ఎరుగని భద్రత..! ఆర్పీఎఫ్ సెలవులు రద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో.. అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమి కూడి ఉండే ప్రాంతాలు, ప్రదేశాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి ప్రయాణ ప్రాంగణాలపైనా డేగకన్ను వేసింది. ఆయా ప్రాంతాలన్నింటినీ కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరింపజేస్తోంది.

ప్రయాణ ప్రాంగణాలు టార్గెట్ గా మారకుండా..
రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి ప్రదేశాలు నిత్యం జనసమ్మర్థంతో కూడుకుని ఉంటాయి. అలాంటి చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే.. దాని ఫలితం భయానకంగా ఉంటుంది. అలాంటి వాటిని అరికట్టడానికి రైల్వే మంత్రిత్వ శాఖ వెంటనే కార్యాచరణలోకి దిగింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు భద్రతాపరమైన అడ్వైజరీని పంపించింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉండగా.. వాటి పరిధిలోని సమస్యాత్మకమైన, సున్నితమైన రైల్వే స్టేషన్లలో రౌండ్ ద క్లాక్ భద్రతా బలగాలను మోహరింపజేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.

78 రైల్వే స్టేషన్లపై డేగ కన్ను..
దేశవ్యాప్తంగా అత్యంత సున్నితమైనవిగా మొత్తం 78 రైల్వే స్టేషన్లను గుర్తించింది రైల్వే శాఖ. అక్కడ కనీవినీ ఎరుగని భద్రత చర్యలను చేపట్టింది. ప్రతి ప్రయాణికుడిని, ప్రతి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయాల్సిందేనంటూ ఆదేశించింది. దీనికోసం అవసరమైన మెటల్ డిటెక్టర్లు, సెక్యూరిటీ గేట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించింది. రైల్వే స్టేషన్ ఆవరణలోకి అక్రమంగా చొరబడే వారిని గుర్తించి, విచారించాలని, అలాంటి మార్గాలను మూసి వేయాలని పేర్కొంది. సీసీ కెమెరాల్లో సాంకేతిక మరమ్మతులు ఉంటే వెంటనే సరిచేసుకోవడంతో పాటు అనుమానితుల కదలికలపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది.

భద్రతలో ఉదాసీనత వద్దు..
భద్రతాపరమైన చర్యలను తీసుకోవడంలో ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు సెక్యూరిటీ అడ్వైజరీలో స్పష్టం చేశారు. ఈ ఉదాసీనతకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన దుస్థితి తలెత్తవచ్చని, అలాంటి తప్పులకు అవకాశం కల్పించవద్దని సూచించింది. ఏదైనా జరగాని సంఘటన జరిగితే.. దాని ఫలితాలు దారుణంగా ఉంటాయనే విషయాన్ని పదే పదే గుర్తు చేసింది. భద్రతాపరమైన లోపాల వల్లే అవాంఛనీయ సంఘటనలకు కారణమౌతాయని, అలాంటి తప్పిదాన్ని నివారించాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిపైనే ఉందని గుర్తు చేసింది.

రైళ్లకూ ఆర్పీఎఫ్ భద్రత..
సమస్యాత్మక ప్రాంతాల గుండా రాకపోకలు సాగించే రైళ్లకు కూడా ఆర్పీఎఫ్ భద్రతను కల్పించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. నడుస్తున్న రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సాయుధ బలగాలతో భద్రత కల్పించేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. రైల్వే స్టేషన్ల అవుటర్ సిగ్నళ్లు మొదలుకుని, రైల్వే గూడ్స్ షెడ్స్, ప్లాట్ ఫామ్స్, రైల్వే యార్డ్స్, పార్కింగ్ ప్రదేశాలు, స్టేషన్లలో ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, టన్నెళ్లు, వర్క్ షాపులు వంటి చోట్ల పెద్ద ఎత్తున బలగాలతో పహారాను ఏర్పాటు చేయనుంది. అలాంటి ప్రాంతాలను గుర్తిస్తూ ఇదివరకే రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లు ప్రత్యేక జాబితాను కేంద్రానికి పంపించారు.












Click it and Unblock the Notifications