అయోధ్యపై తీర్పు: కళాశాల భవనాలే కారాగారాలుగా: ఎనిమిది చోట్ల తాత్కాలిక జైళ్లు..!
లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించనున్న తీర్పునకు కౌంట్ డౌన్ ఆరంభమైంది. అయిదు పని దినాలే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఏ రోజైనా తీర్పు వెలువడటానికి అవకాశం ఉంది. తీర్పు వెలువడిన అనంతరం తలెత్తే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. సమస్యాత్మక రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపించనుంది. మూడు రోజుల కిందటే నాలుగు వేలమంది సాయుధ బలగాలను ఉత్తర్ ప్రదేశ్ లో మోహరింపజేసిన విషయం తెలిసిందే.

కళాశాలలు, ప్రాథమిక పాఠశాలలు కారాగారవాసాలుగా..
తాజాగా- ఉత్తర్ ప్రదేశ్ లో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. అయోధ్యపై తీర్పు వెలువడటానికి ముందు, ఆ తరువాత అవాంఛిత పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలోని అక్బర్ పూర్, టండా, జలాల్ పూర్, జైత్ పూర్, భితి, అల్లాపూర్ లల్లో కళాశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కారాగారాలుగా మార్చేశారు. అల్లర్లకు పాల్పడే వారిని నిర్బంధించడానికి ప్రస్తుతం ఉన్న కారాగారాలు సరిపోవనే ఉద్దేశంతోనే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

34 జిల్లాల్లో హై అలర్ట్..
ఈ మేరకు ఆయా కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లకు అధికారికంగా లేఖలను రాసినట్లు చెప్పారు. దీనితో పాటు- 34 జిల్లాలను సమస్యాత్మకంగా గుర్తించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఆయా జిల్లాల్లో అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మీరట్, ఆగ్రా, అలీగఢ్, రామ్ పూర్, బరేలీ, ఫిరోజాబాద్, కాన్పూర్, లక్నో, షాజహాన్ పూర్, షామ్లీ, ముజప్ఫర్ నగర్, బులంద్ షహర్, ఆజంగఢ్ వంటి జిల్లాల్లో ఘర్షణలు చెలరేగడానికి అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. ఆయా జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వెంటనే అణచివేయడానికి చర్యలు తీసుకుంది.

సెలవులను రద్దు చేసే అవకాశం..
ఆయా జిల్లాల పాలన, పోలీసు యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులను జారీ చేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు తీర్పు వెలువడటానికి ఒకరోజు నుంచే జిల్లా పాలన, పోలీసు యంత్రాంగానికి సెలవులను రద్దు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సెలవుల్లో ఉన్న వారిని కూడా వెంటనే విధుల్లో చేరేలా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే నాలుగు వేల మందికి పైగా అదనపు సాయుధ బలగాలను మోహరింపజేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించబోతోంది.












Click it and Unblock the Notifications