పాపులారిటీ కోసమా?: రేప్ బాధితురాలిపై అజంఖాన్
లక్నో: ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. న్యాయం చేస్తారని వచ్చిన ఓ అత్యాచార బాధితురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన పరువు తానే తీసుకున్నారు.
గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అజంఖాన్ను కలిసేందుకు ఓ బాధితురాలు తన లాయర్ తోపాటు వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు బాధితురాలు ప్రయత్నించగా ఆమెపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పబ్లిసిటీ కోసం పాకులాడొద్దంటూ అత్యాచారా బాధితురాలిపై మండిపడ్డారు. 'నీకు జరిగిన అవమానంతో అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తావా? లేదా ఇలాగైతే సమాజంలో ఎలా జీవిస్తావు?' అంటూ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలకు ఆయన అనుచరులు చప్పట్లు కొడుతూ ఈలలు వేయడం విచారకరం.
దీంతో బాధితురాలు అక్కడ్నుంచి వెళ్లిపోయింది. తనకు న్యాయం చేస్తారని వస్తే మంత్రి తన నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదని బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు.
అప్పటి నుంచి బాధితురాలు న్యాయం కోసం ఆమె పోరాడుతోందన్నారు. కాగా, ఆజంఖాన్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని బిజెపి నాయకులు మండిపడ్డారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి మహిళలపై ఏమాత్రంగౌరవం ఉన్నా ఆజంఖాన్ పై తక్షణమే చర్య తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు.