బాబ్రీ కేసులో సుప్రీం షాక్.. అద్వానీ, ఉమాభారతి, మురళీమనోహర్ జోషిలకు గండం?
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లాల్ కృష్ణ అద్వానీపై ఉన్న కుట్ర కేసును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లాల్ కృష్ణ అద్వానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలో అద్వానీపై ఉన్న కుట్ర కేసును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నెల 22న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దీనిపై స్పష్టత తీసుకురానున్నది. అద్వానీతోపాటు ఇతర నేతలు ఈ కేసులను ఎదుర్కొంటారా లేదా అన్నది అప్పుడే తేలుతుంది. అద్వానీతోపాటు ఇతర నేతలపై ఉన్ కేసులను కింది కోర్టు ఎత్తివేయడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సాంకేతిక కారణాలు చూపుతూ అద్వానీపై కేసు ఎత్తివేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. విచారణ సుదీర్ఘకాలం కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. నిందితుల సంయుక్త విచారణకు అంగీకరించింది.
1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే. లక్నో ట్రయల్ కోర్టు దీనిపై విచారణ జరుపుతున్నది. అద్వానీతోపాటు మరికొందరు నేతలపై ఉన్న కుట్ర కేసులను గతంలో ఈ ట్రయల్ కోర్టు ఎత్తివేసింది.
సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇదే చివరి విచారణ కానుందని, ఆ రోజు బీజేపీలో కొంతమంది సీనియర్ నేతలు కచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా లక్నో, రాయబరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఈ కేసులో అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషిలకు గండం తప్పకపోవచ్చని అంటున్నారు.