రైలులో బాత్రూం వెళ్లిన స్త్రీ ప్రసవం, పట్టాలపై పసికందు (ఫోటో)
అనంతపురం: ఓ పసిపాప రైలులో పుట్టి, రైలు పట్టాల మధ్య కళ్లు తెరిచాడు. ఈ సంఘటన అనంతపురం రైల్వే స్టేషన్లో శనివార ఉదయం ఆరున్నర గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... భువనేశ్వర్ నుండి బెంగళూరు సిటీకి వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం ఆరు నలభై నిమిషాలకు అనంతపురం స్టేషన్కు వచ్చింది.
ఆ సమయంలో ఓ మహిళ బాత్ రూంకు వెళ్లింది. అప్పుడు మరుగుదొడ్డి రంద్రం నుండి ఓ పసికందు పట్టాలపై జారిపడ్డాడు. ప్లాట్ ఫాం పైన పడి ఉన్న పసికందును చూసి అక్కడున్న కానిస్టేబుల్కు తెలిపారు. ఆ కానిస్టేబుల్ పసికందును పరిశీలించి రైలు పట్టాల మధ్యన పడి ఉండటంతో మరుగుదొడ్డి రంధ్రం గుండా కిందపడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాడు.

పసికందు చేతులు ఊపడం, కళ్లు తెరవడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. రైలు ధర్మవరం చేరగానే మైకులో ప్రచారం చేశారు. తల్లిదండ్రులు ఎవరు రాలేదు. దీంతో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా, తల్లి గర్భం దాల్చిన ఏడు నెలలకే ప్రసవించినట్లు వైద్యులు చెప్పారు. ఆ మహిళ ఒంటరిగానే ప్రయాణం చేస్తూ ఉండవచ్చునని భావిస్తున్నారు. శనివారం ఉదయం నొప్పులు రావడంతో మరుగుదొడ్డికి వెళ్లగా అప్పుడే ప్రసవించి ఉండవచ్చునని అంటున్నారు. తల్లి ఊహించకుండానే గర్భం నుండి బయటపడడానికి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications