టీ నుండి దత్తాత్రేయ, ఏపీకి సుజన: బాబుకి మోడీ మళ్లీ..
న్యూఢిల్లీ/హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఈసారి కేంద్ర కేబినట్లో చోటు దక్కనుందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ నుండి బండారుకు దక్కే అవకాశముందని అంటున్నారు. గతంలో వాజపేయి మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఆయన కొనసాగారు.
తాజాగా సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ గెలిచారు. మొన్నటిసారే దత్తాత్రేయకు మంత్రిపదవి వస్తుందని అందరూ బావించారు. కానీ ఆయనకు చేజారింది. ఈసారి ఆయనకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఆదివారం జరగనున్న పునర్వ్యవస్థీకరణలో తప్పనిసరిగా బెర్తు ఖాయమంటున్నారు.
మరోవైపు, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదనను తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు గతంలో లేవనెత్తాయి. బండారు దత్తాత్రేయకు పదవి ఇవ్వడం ద్వారా దీనిని కూడా ఎదుర్కొన్నట్లుగా అవుతుందని భావిస్తున్నారు.
సుజనా పేరు సిఫార్సు చేసిన చంద్రబాబు
నరేంద్ర మోడీ కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సుజనా పేరును సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. సుజనకు సహాయమంత్రి పదవి దక్కనుంది. రేపు అధికారికంగా వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.
కాగా, చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రెండుసార్లు ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి టీడీపీలో ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకే మోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేశారని సమాచారం.
అయితే ఢిల్లీ ప్రయాణంలో ఉన్న చంద్రబాబు తొలి ఫోన్కు అందుబాటులోకి రాలేకపోయారు. దీంతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుకు పీఎంఓ అధికారులు ఫోన్ చేశారని తెలుస్తోంది. చంద్రబాబు అందుబాటులోకి రాగానే మోడీతో మాట్లాడించాలని ఆయనను కోరారు.
అయితే ఢిల్లీలో విమానం దిగిన వెంటనే ఏపీ భవన్కు రాకుండానే చంద్రబాబు ఎకనమిక్ సమ్మిట్లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. దీంతో రెండోసారి కూడా మోడీనే చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ఎకనమిక్ సమ్మిట్లో ప్రసంగిస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి, బయటకెళ్లిన చంద్రబాబు మోడీతో ఫోన్లో మాట్లాడారు.