ముంబై తరహా దాడులకు ప్లాన్: బెంగళూరులో హై అలర్ట్
బెంగళూరు: ముంబై 26/11తరహా దాడులు కర్ణాటకలో చెయ్యాలని ఇండియన్ ముజాహిద్దిన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ సిద్దం అయ్యిందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఐటి, బిటి సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంతో పాటు మైసూరు, మంగళూరులో దాడులు చెయ్యాలని ప్లాన్ చేశారని వెలుగు చూసింది.
విధ్వంసాలు సృష్టించడానికి ఇండియన్ ముజాహిద్దీన్ నాలుగు స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసిందని ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నాలుగు స్లీపర్ సెల్స్ లో 18 మంది యువకులు ఉన్నారని తెలుసుకున్నారు. కర్ణాటక-కేరళ సరిహద్దులోని పశ్చిమ అటవి ప్రాంతంలో ఉగ్రవాదులు మకాం వేశారని పసిగట్టారు.
నాలుగు స్లీపర్ సెల్స్ లోని 8 మంది పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని సముద్ర మార్గంలో కేరళ చేరుకున్నారని, తరువాత కర్ణాటక-కేరళ సరిహద్దులోని దట్టమైన అటవి ప్రాంతంలో మిగిలిన 10 మంది ఉగ్రవాదులకు వీరు శిక్షణ ఇచ్చారని అధికారులు అనుమానిస్తున్నారు.
కర్ణాటక, కేరళలో దాడులు నిర్వహించే బాధ్యతను ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్లకు అప్పగించారని ఇంటిలి జెన్స్ వర్గాలు అంటున్నాయి. కర్ణాటక -కేరళ సరిహద్దులోని దట్టమైన అటవి ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులకు ఇండియన్ ముజాహుద్దిన్ నాయకులు అత్యాధునిక ఆయుధాలు, బాంబులు అందించారని వెలుగు చూసింది.
దాడుల చేస్తే రూ. 10 లక్షలు గిఫ్ట్........!
స్లీపర్ సెల్స్ లో పని చేస్తున్న యువకులు దాడులు చేసిన తరువాత వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రూ. 10 లక్ష ఆశ చూపించి కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, హుబ్బళి, బెల్గాం, ఉడిపి, కులబర్గి, కేరళలోని తిరువనంతపురం, కణ్ణూరు, మల్లాపురం, కోచ్చితో పాటు ఇతర ప్రాంతాలలోని నిరుపేద కుటుంబంలోని ఒక వర్గంలోని యువకులకు గాలం వేశారని వెలుగు చూసింది.
గతంలో ఇలా దాడులు చేశారు..............!
గత 14 సంవత్సరాలలో కర్ణాటకలో వరస చర్చి పేలుళ్లతో పాటు బెంగళూరు నగరంలో ఐదు సార్లు ఉగ్రవాదులు దాడులు చేశారు. 2001లో కర్ణాటకలోని అనేక ప్రాంతాలలో చర్చిలు పేల్చి వేశారు. 2005 డిసెంబర్ 28వతేది బెంగళూరులోని ఐఐఎస్ సీ మీద దాడి చేసి ఒక శాస్త్రవేత్తను హత్య చేశారు.
2008 జులై 25వ తేదిన నగరంలోని 9 ప్రాంతాలలో వరస బాంబు పేలుళ్లు జరిగాయి. ఒక మహిళ మరణించి 40 మందికి గాయాలైనాయి. 2010 ఏప్రిల్ 17వ తేదిన చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబు పేలుళ్లు జరగడంతో ఆరు మందికి గాయాలైనాయి.
2013 ఏప్రిల్ 17వ తేదిన మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు జరగడంతో 11 మంది పోలీసులతో పాటు 16 మందికి గాయాలైనాయి. 2014 డిసెంబర్ 28వ తేదిన ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ లో బాంబు పేలుడు జరడగడంతో మహిళ మరణించి ముగ్గురికి గాయాలైనాయి.
2010, 2013 సంవత్సరాలలో ఏప్రిల్ 17వ తేదిన బెంగళూరులో రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పుడు ఏప్రిల్ 17వ తేది సమీపిస్తున్న సమయంలో ఇంటిలి జెన్స్ వర్గాలు పోలీసు అధికారులు అలర్ట్ చేశారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు పలు చోట్ల సోదాలు, నాకాబందీలు చేస్తున్నారు.