గాల్లో బంగ్లాదేశ్ పైలట్ కు గుండెపోటు-నాగపూర్ లో విమానం అత్యవసర ల్యాండింగ్
ఇవాళ బంగ్లాదేశ్ విమానయాన చరిత్రలో ఓ ఘోర ప్రమాదం తప్పిపోయింది. మస్కట్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వస్తున్న బిమన్ బంగ్లాదేశ్ విమానాన్ని నడుపుతున్న పైలట్ కు గుండెనొప్పి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఏటీసీ, సహ పైలట్ సాయంతో విమానాన్ని భారత్ లోని నాగపూర్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం గల్ఫ్ దేశాల్లోని మస్కట్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు బయలుదేరింది. అయితే బయలుదేరిన కొంతసేపటికే పైలట్ కు గుండె నొప్పిగా అనిపించింది. విషయాన్ని సహ పైలట్ కు తెలిపాడు. అప్పటికే విమానం భారత భూభాగంపై నుంచి ఎగురుతోంది. స్ధానికంగా సమీపంలో కోల్ కతా ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉంది. దీంతో వీరు కోల్ కతా ఏటీసీని సంప్రదించి విషయాన్ని తెలిపారు. వారు మిగతా ఏటీసీలతో సంప్రదింపులు మొదలుపెట్టారు.
చివరికి నాగ్ పూర్ ఏటీసీ నుంచి సమాచారం అందింది. నాగ్ పూర్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ కు అధికారులు అనుమతించారు. దీంతో బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం సురక్షితంగా నాగ్ పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సహకరించిన సహ పైలట్ కు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. గుండెనొప్పికి గురైన పైలట్ ను స్ధానిక ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరో పైలట్ సాయంతో విమానాన్ని ఢాకాకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ కు చెందిన బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ సంస్ధ కోవిడ్ కారణంగా భారత్ కు గతంలో రద్దు చేసిన విమాన సర్వీసుల్ని తాజాగా పునరుద్ధరించింది. భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాల చర్చల తర్వాత విమానయాన సంస్ధ భారత్ తో పాటు ఇతర దేశాలకు కూడా విమానాలు పునరుద్ధరించింది. ఇలాంటి సమయంలో పైలట్ కు గుండెపోటుతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి రావడం బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల్లోనూ ఉత్కంఠ రేపింది. చివరికి విమానం అత్యవసరంగా అయినా సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఉపిరిపీల్చుకుంటున్నారు.