ఇతరుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే ఏడేళ్ల జైలు శిక్ష
రూ.500, రూ.1000 నోట్లు రద్దయిన నేపథ్యంలో ఇతరుల పాత నోట్లను ఖాతాల్లోకి జమ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలా చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు రద్దయిన నేపథ్యంలో ఇతరుల పాత నోట్లను ఖాతాల్లోకి జమ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆదివారం నాడు హెచ్చరికలు జారీ చేసింది. ఇతరుల ఖాతాల్లో పాత నోట్లు జమ చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది.
50 రోజుల టైం అడిగా, ఇబ్బందులుంటాయని చెప్పా: మోడీ
ఆదాయ పన్ను శాఖ నిబంధనల మేరకు ఒక్కో ఖాతాలో రూ.2.5లక్షల కంటే ఎక్కువ నగదు ఉంటే వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే జన్ ధన్ యోజన ఖాతాల్లో రూ.50వేల వరకు జమ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ తర్వాత బ్యాంకు ఖాతాల్లోని జమలపై ఆరా తీస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు సెక్షన్133(6) కింద వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ఖాతాదారుల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్ని ఖాతాల్లో అసాధారణ, అనుమానాస్పద మొత్తాలు జమ అయినట్లు పలు బ్యాంకుల నుంచి ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే, ఖాతాదారులను బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేస్తారు.
కాగా, నవంబర్ 8న ప్రధాని మోడీ ప్రకటన చేసినప్పటి నుంచి ఐటీ శాఖ వివిధ రాష్ట్రాలలో రూ.50 కోట్లను సీజ్ చేసింది. 80 సర్వేలు, 30 సెర్చ్ ఆపరేషన్లలో అధికారులు గుర్తు తెలియని ఆదాయాన్ని రూ.200 కోట్లను గుర్తించారు.