అరెస్ట్ భయంతో బెంగళూరులో బ్యాంకు ఉద్యోగి సూసైడ్
సస్పెన్షన్ కు గురైన ఓ బ్యాంకు ఉద్యోగి అరెస్ట్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ కు పాల్పడ్డాడు.
బెంగళూరు: నల్లదనం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే రాకెట్ కు సహకరించాడనే ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన ఓ బ్యాంకు ఉద్యోగి అరెస్ట్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ కు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని వివేక్ నగర్ కు చెందిన రవిరాజ్(55) అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచిలో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే రాకెట్ కు సహకరించాడు.
ఆదాయపన్ను శాఖ ఆధికారులు కూపీ లాగడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. అప్పటికే రవిరాజ్ 20 లక్షల రూపాయల వరకు రద్దైన నోట్ల స్థానంలో కొత్త రూ.2 వేల నోట్లు బయటికి పంపించినట్లు సమాచారం. ఈ విషయం గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు అతడ్ని వెంటనే సస్పెండ్ కూడా చేశారు.
ఇదే విషయమై సోమవారం బ్యాంకు అధికారులు అతడ్ని విచారణకు పిలిపించారు. అప్పటికే అవమాన భారంతో కుంగిపోయి ఉన్న రవిరాజ్ ఇక తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వివేక్ నగర్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.