కేదార్నాథ్ శిథిలాల్లో బ్యాంక్ లాకర్, 1.9 కోట్లు స్వాధీనం
డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదలతో పెను విధ్వంసానికి గురైన కేదార్నాథ్ ఆలయంలో ఈ నెల 11వ తేదీన పూజలను పునరుద్ధరించడానికి ముందు జరిపిన శిథిలాల తొలగింపు ప్రక్రియలో ఒక బ్యాంకు లాకర్ బయల్పడిందని, దీని నుంచి 1.90 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)కు చెందిన ఈ లాకర్ ఈ నెల 8వ తేదీన శిథిలాల నుంచి బయటపడిందని, ఈ విషయాన్ని వెంటనే డెహ్రాడూన్లోని ఎస్బిఐ అధికారులకు తెలిపామని రుద్రప్రయాగ ఎస్పీ వీరేందర్జీత్ సింగ్ తెలిపారు.
బ్యాంకు అధికారుల సమక్షంలో శనివారం ఈ లాకర్ను తెరిచి 1.90 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, ఈ మొత్తాన్ని ఎస్బిఐ చీఫ్ మేనేజర్ అనూప్ లాంబాకు అప్పగించామని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ వద్ద ిటీవల వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ బీభత్సంలో కొట్టుకుపోయిన ఓ బ్యాంకు లాకర్ ఒకటి శిథిలాల్లో బయటపడింది. కాగా, ఇటీవలే చమోలి జిల్లాలో ఒక భవనం శిథిలాల్లో చిక్కుకున్న ఎస్బిఐ లాకర్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.