ఇంకో కొత్త బాదుడు: యూపీఐ ఛార్జీలు తప్పవంటున్న హెచ్డిఎఫ్సి..
ఇప్పటిదాకా యూపీఐపై ఏ బ్యాంకు ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు దానికి నాంది పలకగా.. త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్.బి.ఐ కూడా యూపీఐ చార్జీల వసూలుకు సిద్దమవుతోంది.
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా చేసే పీర్-టూ-పీర్(పర్సన్ టూ పర్సన్) పేమెంట్లకు కూడా ఇకనుంచి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు యూపీఐ ఛార్జీలపై ఒక ప్రకటన విడుదల చేసింది.
యూపీఐ లావాదేవీలపై , ఫండ్స్ ట్రాన్సఫర్ చేసేటప్పుడు పొందే ప్రయోజనాలపై ఛార్జీల వసూలు చేయనున్నారు. ఈ మేరకు రూ.25వేల లావాదేవీకి రూ.3 చార్జీ విధించనున్నారు. రూ.25వేలకు పైబడి రూ.1లక్ష లోపు చేసే లావాదేవీలకు రూ.5ఛార్జీగా వసూలు చేయనున్నారు.
ఇప్పటిదాకా యూపీఐపై ఏ బ్యాంకు ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు దానికి నాంది పలకగా.. త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్.బి.ఐ కూడా యూపీఐ చార్జీల వసూలుకు సిద్దమవుతోంది. కాగా, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్.పి.సి.ఐ) మాత్రం యూపీఐపై ఛార్జీలను విధించవద్దని గతంలో సూచించింది.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఇది ఉపకరిస్తుందని, కాబట్టి దీనిపై ఛార్జీలు ఉండకూడదని కోరింది. నోట్ల రద్దు అనంతరం యూపీఐని ఎక్కువ మంది వినియోగిస్తున్నందునా..పీర్ టూ పీర్ ఛార్జీలు వద్దనేది ఎన్.పి.సి.ఐ వాదన. మరోవైపు యస్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకులు మాత్రం యూపీఐపై ఎలాంటి ఛార్జీలు విధించేది లేదని స్పష్టం చేశాయి.