టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేయండి.. అడ్డొస్తే పోలీసులపై కూడా... బెంగాల్ బీజేపీ చీఫ్ కాంట్రవర్సీ
కోల్కతా : పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన డామినేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల ఘర్షణలో పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడులకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఎంసీ నేతలు, శ్రేణులపై దాడికి దిగాలని .. ఒకవేళ పోలీసులు టీఎంసీ నేతలను సపోర్ట్ చేస్తే వారిపై కూడా దాడికి తెగబడాలని పిలుపునిచ్చారు.
నోటిదురుసు ..
తూర్పు మిడ్నాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ శ్రేణులకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. పనిలో పనిగా ప్రతీదాడులకు సిద్ధంగా ఉండాలని కోరారు. తమపైకి వచ్చే టీఎంసీ శ్రేణులపై దాడి చేయాలని స్పష్టంచేశారు. వారికి మద్దతిచ్చే చెంచా పోలీసులపై కూడా చేయిచేసుకోవాలని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. ముందు దాడి చేయండి .. తర్వాత తన వద్దకు రావాలని సూచించారు. వారిపై దాడిచేశాక .. మీ బాధ్యత నాది అని వారికి భరోసానిచ్చారు. మీకు నేనున్నానంటూ ధైర్యం నూరిపోశారు.
వేధిస్తున్నారు ...
టీఎంసీ సర్కార్ బీజేపీ కార్యకర్తలను వేధిస్తుందని గుర్తుచేశారు. టీఎంసీ కార్యకర్తలు, పోలీసుల వేధింపులను బీజేపీ శ్రేణులు భరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక అలాంటి చర్యలను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలపై 28 వేల కేసులు నమోదు చేశారని వివరించారు. ఇందుకోసం బీజేపీ పార్టీ కోట్ల రూపాయలు వ్యయం చేస్తుందని వివరించారు. ఇప్పటికే వందలాది మంది బీజేపీ నేతలు జైలుకు వెళ్లారని చెప్పారు. అంతేకాదు తనపై కూడా ఓ హత్య కేసు నమోదు చేశారని దీదీ పాలన గురించి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఎంసీ తప్ప మరో పార్టీ ఉండకూడదా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్లు రావడంతో తమపై ప్రతీకార దాడులు చేపట్టారని మండిపడ్డారు.
మీ సంగతి చూస్తా ..
పనిలో పనిగా పోలీసు అధికారులపై కూడా నోరు పారేసుకున్నారు దిలీప్. దీదీ సర్కార్ హయాంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడితే వారి పనిచెప్తామని హెచ్చరించారు. అప్పుడు తమ బారి నుంచి వారిని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. దీదీ కాపాడుతారా ? టీఎంసీ శ్రేణులు కాపాడుతారా ? అని నిలదీశారు. తాము 18 సీట్లు గెలవడంతో .. తమ ఆధిప్యతం మొదలైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.