కర్ణాటకలో బీజేపీకి 135 సీట్లు, కాంగ్రెస్ 35 సీట్లు అంటూ బీబీసీ సర్వే, సీఎం ఫైర్, బీబీసీ క్లారిటీ!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రముఖ మీడియా బీబీసీ సర్వే అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సర్వే నకిలీ అని వెలుగు చూసింది. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 135 సీట్లు వస్తాయని బీబీసీ సర్వే విడుదల చేసిందని అనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న బీబీసీ ఇండియా చివరికి ఇది మా సర్వే కాదని వివరణ ఇచ్చుకుంది.
బీబీసీ సర్వే ఇదే
సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల సర్వే చేసిన బీబీసీ సంస్థ నివేదిక విడుదల చేసిందని వాట్సాప్, ఫేస్ బుక్ లో ఓ వార్త వైరల్ అయ్యింది. విషయం గుర్తించిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఈ సర్వేపై తీవ్రస్థాయిలో చర్చ మొదలు పెట్టారు.
బీజేపీకి 135 సీట్లు
సోషల్ మీడియాలో బీబీసీ సర్వే అంటూ వైరల్ అవుతున్న నివేదిక ప్రకారం బీజేపీకి 135 సీట్లు వస్తాయి. జేడీఎస్ కు 45 సీట్లు వస్తాయి. ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 35 సీట్లు వస్తాయని, ఇతరులు 19 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆ సర్వే తెలిపింది.
బీబీసీ లోగో
బీబీసీ న్యూస్ చానల్ అధికారిక లోగోతో బయటకు వచ్చిన ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనతా కి బాత్ పేరుతో బయటకు వచ్చిన ఈ సర్వే 10 నుంచి 20 లక్షల మందితో నిర్వహించామని, 2013 ఎన్నికల కంటే అధికంగా 95 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బీఎస్ యడ్యూరప్ప తదితరులు ప్రచారంతో బీజేపీకి 125-135 స్థానాలలో విజయం సాధించి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తోందనే సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జేడీఎస్, స్వతంత్రులు
జేడీఎస్ పార్టీకి 45 స్థానాలు వస్తాయని, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధిస్తారని ఈ సర్వే చెబుతోంది. అయితే ఆ 19 మంది స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఎవరు అనే విషయం ఈ సర్వేలో లేదు. జనతా కి బాత్ పేరుతో ఎలాంటి సంస్థ ఈ సర్వే చెయ్యలేదని వెలుగు చూసింది. ఈ సర్వే ఏమాత్రం నిజం కాదని తెలిసింది.
హీనస్థితిలో కాంగ్రెస్
ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది. 2013వరకు అధికారంలో ఉన్న బీజేపీ మీద ప్రజలు అసహనం వ్యక్తం చెయ్యడంతో కేవలం 40 సీట్లకే పరిమితం అయ్యింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు అంత అసహనం వ్యక్తం చెయ్యకపోయినా కేవలం 35 సీట్లు మాత్రం వస్తాయని వార్తలు ప్రచారం చేశారు. ఈ సర్వే నకిలీ అని తెలియడంతో బీజేపీ కార్యకర్తల మీద కాంగ్రెస్ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.
బీజేపీ మాస్టర్ ప్లాన్
బీబీసీ సర్వే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త వాస్తవాలను గెలవడం అంత సులభం కాదని, బీజేపీ తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఇలాంటి తప్పుడు వార్త ప్రచారం చేస్తోందని, ఇది బీజేపీ పతనానికి సంకేతమా అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ట్వీట్టర్ లో వ్యంగంగా ప్రశ్నించారు.