బీజేపీ సెంచరీ: కాంగ్రెస్ను చీకొట్టిన బెంగళూరు
బెంగళూరు: కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు నగర ప్రజలు చుక్కలు చూపించారు. బీబీఎంపీ ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టి కాంగ్రెస్ ను ప్రతిపక్షంలో కుర్చోపెట్టారు. గతంలో జరిగిన బీబీఎంపీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు ఎలాగైనా బీబీఎంపీలో అధికారంలో రావాలని కలలుకన్న కాంగ్రెస్ నాయకుల ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. బెంగళూరు నగరం నుండి శాసన సభ్యులుగా గెలుపొందిన నలుగురు సీనియర్లు మంత్రులుగా ఉన్నారు.
బీబీఎంపీ ఎన్నికలలో వారే చక్రం తిప్పారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎప్పటికప్పుడు మంత్రులకు శాసన సభ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు భంగపాటుఎదురైయ్యింది.
బీబీఎంపీ ఎన్నికలలో నామినేషన్ పత్రాలు సక్రమంగా లేకపోవడంతో కాంగ్రెస్ ఎన్నికల ముందే ఒక సీటు బీజేపీకి అప్పగించింది. తరువాత జరిగిన 197 వార్డులలో నువ్వా నేనా అని పోటి పడ్డారు. చివరికి బెంగళూరు ప్రజలు కాంగ్రెస్ ను చీకొట్టి, బీజేపీకి జై కొట్టారు.
బీబీఎంపీ ఎన్నికలలో బీజేపీ 100 సీట్లు, కాంగ్రెస్ 76, జేడీఎస్ 14, ఇతరులు 8 స్థానాలలో గెలుపొందారు. బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖరారైయ్యింది. జేడీఎస్ ఎట్టిపరిస్థితిలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వదు. ఇక ఇతరులకు కాంగ్రెస్ గాలం వేసినా ఫలితం ఉండదు.
ఎన్నికల ముందు అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగానే నివేదికలు ఇచ్చాయి. 110 సీట్లు గ్యారెంటి అని అన్నారు. అయితే ఓటర్ల నాడి తెలియని సర్వేలు కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇచ్చాయి.
మంత్రులు, ఎంఎల్ఏలతో సమావేశం
బీబీఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం సిద్దరామయ్య అన్నికార్యక్రమాలు రద్దు చేసుకుని బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులతో అత్యవసర సమావేశం ఎర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి అని ఆరా తీశారు.
అధికారంలో ఉన్న మనం బెంగళూరు కార్పొరేషన్ బీజేపీకి అప్పగించామని, పార్టీ పెద్దలకు ఏమి సమాధానం చెప్పాలి అంటు సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఓటమిని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ అంగీకరించారు. ఇది ప్రజల తీర్పు అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నాయకులకు బెంగళూరు ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు.