విండీస్పై బిసిసిఐ ఫైర్: రూ. 250 కోట్లు డిమాండ్
వెస్టిండీస్ జట్టు భారత సిరీస్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోవడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని, దానిపై వెంటనే పరిష్కారంతో ముందుకు రావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ ఓ లేఖ రాసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఒక్క మీడియా హక్కుల రూపంలోనే బిసిసిఐకి 35 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
టికెట్ల అమ్మకాల రూపంలో మరో 2 మిలియన్ డాలర్లు, టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మైక్రోమాక్స్కు 1.6 మిలియన్ డాలర్లు - ఇలా భారీ నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేస్తున్నారు. ఇతర నష్టాలను కూడా వివరిస్తూ బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాశారు.
భారత్తో ఐదు వన్డేలు, ఓ ట్వంటీ20, మూడు టెస్టు మ్యాచులు ఆడాల్సిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు సభ్యులు ధర్మశాలలో నాలుగో వన్డే ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయారు. బిసిసిఐ తమకు వాటిల్లిన నష్టంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు దావే కామెరోన్కు నాలుగు పేజీల లేఖ రాసినట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను ఆపేస్తున్నట్లు బిసిసిఐ లేఖ తెలిపింది. ధర్మశాల వన్డేలో కూడా ఆడడానికి వెస్టిండీస్ ఆటగాళ్లు నిరాకరించారని, అయితే బిసిసిఐ విజ్ఞప్తితో మైదానంలోకి దిగారని సంజయ్ తన లేఖలో గుర్తు చేశారు.