బీజేపీకి ఝలక్: 'బీఫ్ బ్యాన్'పై ఎదురుతిరుగుతున్న నేతలు.. ఇద్దరి రాజీనామా
బెర్నార్డ్ మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యమంటున్నారు. ఈ క్రమంలో మేఘాలయలో కబేళాలను చట్టబద్దం చేస్తామని కూడా బెర్నార్డ్ ప్రకటించారు.
షిల్లాంగ్: బీజేపీ అధికారంలోకి వచ్చాక.. తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇటీవల పశుమాంసంపై నిషేధించడం కూడా ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో జరిగిన వ్యవహారమేనన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కోసమే బీఫ్ పై నిషేధం తీసుకొచ్చారన్న విమర్శలున్నాయి.
బయటి వ్యక్తుల ఆరోపణలు ఎలా ఉన్నా.. ఈ నిర్ణయంపై సొంతగూటి నుంచే బీజేపీ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. బీఫ్ తినడం తమ సంస్కృతి, సాంప్రదాయమని సొంత పార్టీ నేతలే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మేఘాలయలోని బీజేపీ నేతలంతా బీఫ్ బ్యాన్ కు వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారు.

ఇప్పటికే బీజేపీకి చెందిన బెర్నార్డ్ మారక్ పార్టీని వీడగా.. తాజాగా మరో కీలక నేత బాచు మారక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు, ఈ నెల 10న బెర్నార్డ్ మారక్ ఇచ్చే బీఫ్ పార్టీలోను తాను పాల్గొంటున్నట్లు చెప్పారు. నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న బాచు మారక్ రాజీనామా పార్టీకి పెద్ద దెబ్బే.
రాజీనామాకు సంబంధించి పార్టీకి ఆయన ఒక లేఖ పంపించారు. తమ ఆచార సాంప్రదాయాలకు బీజేపీ ఏమాత్రం విలువ ఇవ్వనందువల్లే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీఫ్ తినడం తమ సాంప్రదాయ ఆహారమని బాచు మారక్ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్బంగా.. బీర్ అండ్ బీఫ్ పార్టీ చేసుకోవాలని ఇటీవల అక్కడి పార్టీ వర్గాలు ఇచ్చిన ఫేస్ బుక్ పిలుపు పట్ల అధిష్టానం అసంతృప్తితో ఉంది. మరోవైపు పార్టీ అధిష్టానం బెర్నార్డ్ మారక్ రాజీనామాను బీజేపీ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది.
బెర్నార్డ్ మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యమంటున్నారు. ఈ క్రమంలో మేఘాలయలో కబేళాలను చట్టబద్దం చేస్తామని కూడా బెర్నార్డ్ ప్రకటించారు. అంతేకాదు, 2018లో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్ పై నిషేధం ఉండదని, సాధారణ ధరలకే అందరికీ అందుబాటులో బీఫ్ దొరికేలా చూస్తామని బెర్నార్డ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications