మోదీకి దిమ్మతిరిగే షాక్: దొంగిలిస్తావో అడుక్కుంటావో.. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిందే: ఢిల్లీ హైకోర్టు
''దేశ ప్రజల బాధ్యత ప్రభుత్వాలదేనని మర్చిపోయారా? కరోనా విలయ కాలంలో అడుగడుగునా ఆక్సిజన్ కొరత విషయంలో ప్రభుత్వం వాస్తవికతను ఎలా విస్మరిస్తుంది? ఆక్సిజన్ లేని కారణంగా ప్రజలు చనిపోవాలా? అంటే జనం ప్రాణాలపై సర్కార్కు ఏమాత్రం పట్టింపు లేనట్టేనా? ఇంతటి ఘోరాన్ని మేం చూస్తూ కూర్చోవాలా? వెళ్లండి.. అడుక్కుంటారో, అరువు తెస్తారో లేక దొంగతనమే చేస్తారో మాకు అనవసరం. అన్ని ఆస్పత్రులకు వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయండి.. '' అంటూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారును ఢిల్లీ హైకోర్టు కడిగిపారేసింది.

మాక్స్ ఆస్పత్రి పిటిషన్పై
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండటం, దాదాపు ఆస్పత్రులన్నీ నిండుకుని, క్రిటికల్ రోగుల సంఖ్య అమాంతం పెరగడంతో అంతటా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఢిల్లీ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆక్సిజన్ కొరత తీవ్ర సమస్యగా మారింది. ఆక్సిజన్ ట్రైన్ల పేరుతో కొంత హడావుడి జరుగుతున్నా సరిపడా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమవుతోంది. ఆక్సిజన్ కొరతకు పరిష్కారం చూపాలంటూ ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రుల యాజమాన్యం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని అత్యవసరంగా విచారించింది..

జీవించే హక్కును కాలరాస్తారా?
మాక్స్ ఆస్పత్రులకు వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయాలని, అవసరం ఉన్న అన్ని ఆస్పత్రులకూ ఆక్సిజన్ అందించాలంటూ ఢిల్లీ హైకోర్టులో మంగళవారం జారీ చేసిన ఆదేశాలను కేంద్రం అమలు చేయలేదు. దీంతో బుధవారం నాటి వాదనలు వాడీవేడిగా సాగాయి. ఒక రోజు మొత్తం ఏం చేశారని కేంద్రం తరఫు న్యాయవాదిని జడ్జిలు నిలదీశారు. ప్రజల జీవించే హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదని, ఆక్సిజన్ను అందుబాటులో ఉంచాల్సిందేనని జస్టిస్ విపిన్ సంఘి , జస్టిస్ రేఖ పల్లి ధర్మాసనం ఆదేశించింది. కాగా,

కేంద్రం చేతిలో అన్నీ ఉన్నా..
మ్యాక్స్ హాస్పిటల్స్ వేసిన పిటిషన్ను ఇంత అత్యవసరంగా విచారించడమేంటని కేంద్రం తరఫు న్యాయవాది విస్మయం వ్యక్తం చేయగా.. కోర్టు మొట్టికాయలు వేసింది.''పిటిషన్ను చూసి ఆశ్చర్యపోవద్దు. మీకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసి ఉండాలి. పెట్రోలియం, ఉక్కు పరిశ్రమలు ఆక్సిజన్ను ఇంకా వినియోగించుకుంటున్నాయని నిన్ననే చెప్పాం. ఏం చేశారు? ఫైళ్ల కదలికల గురించి మాకు అనవసరం. రతన్ టాటా లాంటి ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రభుత్వం అధీనంలో పెట్రోలియం కంపెనీలున్నాయి. ఎయిర్ ఫోర్స్, ఇతర బలగాలూ కేంద్రం చేతిలో ఉన్నాయి. అవసరమైతే పరిశ్రమల్లో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని మెడికల్ ఆక్సిజన్గా మార్చేందుకు చర్యలు తీసుకోండి. అడుక్కుంటారా, బతిమాలుతారా, దొంగిలిస్తారా అనేది మాకు అనవసరం. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందితీరాల్సిందే'' అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications