ఐదో విడత పోలింగ్లోనూ హింస... బెంగాల్లో రాళ్లు రువ్వుకున్న టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు...
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఐదో విడత ఎన్నికల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) ఐదో విడత పోలింగ్ సందర్భంగా నార్త్ 24 పరగణాలు జిల్లాలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బీదన్నగర్లోని శాంతి నగర్ ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాళ్ల దాడి సమయంలో బీజేపీ అభ్యర్థి సబ్యసాచి దత్తా అక్కడే ఉన్నారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ... తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొరబడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరోవైపు టీఎంసీ నేతలు బీజేపీ ఆరోపణలు ఖండించారు. 'సబ్యసాచి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. బీదన్ననగర్లో టీఎంసీ తరుపున సుజిత్ బోస్ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరుపున సబ్యసాచి అక్కడ పోటీ చేస్తున్నారు.
బర్దమాన్ జిల్లాలోని పుర్బా ప్రాంతంలో ఉన్న దుబ్రజ్దిఘి పోలింగ్ కేంద్రం వద్ద కూడా టీఎంసీ-బీజేపీ నేతలు గొడవపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.
కాగా,శనివారం(ఏప్రిల్ 17) పశ్చిమ బెంగాల్లోని 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదో విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు నాలుగో విడత పోలింగ్ సమయంలోనూ రాష్ట్రంలోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కూచ్బెహార్ జిల్లాలో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. స్థానికులు భదత్రా బలగాలపై దాడికి యత్నించనందుకే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని ఈసీ ప్రకటించింది.
ఆ కాల్పుల ఘటనపై టీఎంసీ,బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కేంద్రం డైరెక్షన్లోనే భద్రతా బలగాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని టీఎంసీ ఆరోపించగా... టీఎంసీ నేతలే స్థానికులను భద్రతా బలగాల పైకి ఉసిగొల్పారని బీజేపీ ఆరోపించింది. ఓటమి తప్పదన్న భయంతోనే అధికార టీఎంసీ గూండాలు భద్రతాసిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించింది. బెంగాల్లో మొత్తం 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Recommended Video