టీఎంసీకి గుడ్బై చెప్పనున్న మరో కీలక నేత... బీజేపీలో చేరేందుకు సిద్దమైన సిట్టింగ్ ఎమ్మెల్యే...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు అధికార టీఎంసీ పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరగా... తాజాగా మరో టీఎంసీ ఎమ్మెల్యే కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇటీవల టీఎంసీ ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యే సోనాలి గుహా బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది.
పార్టీ మార్పుపై స్పందించిన సోనాలి గుహా...'బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం హాస్టింగ్స్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరుతా.' అని వెల్లడించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోలేదని... పార్టీ కోసం ఎంత పనిచేసినా తనకు కనీస గౌరవం కూడా దక్కలేదని ఆమె వాపోయారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు.
టీఎంసీలో పార్టీ కోసం ఎలాగైతే కష్టపడ్డానో... బీజేపీలో చేరాక ఆ పార్టీ కోసం కూడా అంతే కృషి చేస్తానని సోనాలీ గుహా పేర్కొన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన సోనాలికి మమతా బెనర్జీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మమత విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు చోటు దక్కకపోవడంతో సోనాలీ గుహా కంటతడి పెట్టుకున్నారు.తన అభిప్రాయాలను మమతా ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా,బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది నెలలుగా బీజేపీలోకి వలసలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు టీఎంసీని వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే ఎంతమంది పార్టీని వీడినా గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు దీదీ. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న నినాదంతో ఆమె దూసుకెళ్తున్నారు. మరోవైపు టీఎంసీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని... ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈసారి బెంగాల్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్న ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో చివరకు బెంగాల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఏబీపీ,సీ-ఓటర్ సర్వేలో బెంగాల్ గడ్డపై మళ్లీ మమతదే గెలుపు అన్న అంచనాలు వెలువడటం గమనార్హం.