బెంగాల్ డాటర్... అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మారుమోగుతున్న నినాదం... దీదీకి బీజేపీ కౌంటర్ స్లోగన్...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ,బీజేపీలు తమవైన స్లోగన్స్తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఔట్సైడర్స్ అంటూ మోదీ,అమిత్ షాలను మమతా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెంగాల్ ప్రజలు బెంగాల్ బిడ్డనే కోరుకుంటున్నారు(bengal wants it own daughter) అని టీఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ దీనికి కౌంటర్ స్లోగన్ తీసుకొచ్చింది. ఇరువురి పోటాపోటీ నినాదాలతో బెంగాల్ రాజకీయం రక్తి కడుతోంది.
బీజేపీ కౌంటర్ స్లోగన్...
'బెంగాల్కు బెంగాల్ సొంత బిడ్డే కావాలి... మేనత్త కాదు...' అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. శనివారం(ఫిబ్రవరి 27) ఇదే స్లోగన్ను ట్విట్టర్లో ట్వీట్ చేసిన బీజేపీ... తమ పార్టీకి చెందిన పలువురు మహిళా నేతల ఫోటోలను కూడా పోస్టు చేసింది. ఇందులో కేంద్రమంత్రి దెబోశ్రీ చౌదరి,ఎంపీ రూపా గంగూలీ,రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ అగ్నిమిత్ర పౌల్,కిసాన్ మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీరూపా మిత్ర చౌదరి,రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారతి ఘోష్ తదితరులు ఉన్నారు. వీళ్లంతా బెంగాల్ బిడ్డలేనని... టీఎంసీ విమర్శిస్తున్నట్లు తాము ఔట్సైడర్స్ కాదని చెప్పుకునేందుకు బీజేపీ ఈ ట్వీట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది.
టీఎంసీ-బీజేపీ మాటల యుద్దం...
రాష్ట్రంలో అత్త-అల్లుడు కలిసి అంతు లేని అవినీతికి పాల్పడ్డారని మమతా బెనర్జీ,ఆమె మేనల్లుడు అభిషేక్ను ఉద్దేశించి గత కొద్దిరోజులుగా బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'బెంగాల్కు బెంగాల్ బిడ్డనే కావాలి... మేనత్త కాదు..' అనే నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. అటు మమత కూడా బీజేపీ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు నెలకోసారి వచ్చి బెంగాల్ను సందర్శించి వెళ్లిపోతారని... కానీ ఇదే నేలపై పుట్టిన తాను ఎప్పటికీ ఇక్కడే ఉంటానని మమతా బెనర్జీ తన ప్రచార ర్యాలీల్లో పేర్కొంటున్నారు.
మహిళలకు మమతా చేసిందేమీ లేదని...
'మమతా బెనర్జీ బెంగాల్ను దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లారు. ఆమె హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది ఏమీ లేదు. బెంగాల్లోని తల్లులు,కుమార్తెల పట్ల నేరాలను ఆమె నియంత్రించలేకపోయారు. విద్యా వ్యవస్థ పతనమైంది.అందుకే ఇప్పుడు బెంగాల్ కూడా నవభారత ప్రగతిలో భాగస్వామి కావాలనుకుంటోంది.' అని బెంగాల్ బీజేపీ ఇన్చార్జి అమిత్ మాళవియా పేర్కొన్నారు. మరోవైపు టీఎంసీ... బీజేపీలో అసలు మహిళలకు ప్రాధాన్యతే లేదని... ఎంతసేపూ వారిని ద్వితీయ శ్రేణిగానే పరిగణిస్తారని విమర్శిస్తోంది. టీఎంసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ ఉండటం... మహిళల సాధికారతకు నిదర్శనం అని చెబుతోంది.
ఎన్నికల షెడ్యూల్...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎనిమిది దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మొదటి దశ పోలింగ్ మార్చి 27న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఏప్రిల్ 6, నాలుగో దశ ఏప్రిల్ 10న జరుగుతాయి. ఐదో దశ పోలింగ్ ఏప్రిల్ 17న ఉంటుంది. ఆరో దశ ఏప్రిల్ 22, ఏడో దశ ఏప్రిల్ 26, చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ ఏప్రిల్ 29న ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. అయితే బీజేపీ మేలు చేసేందుకు బెంగాల్లో ఇన్ని దశల్లో ఎన్నికలు చేపడుతున్నారని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.