షాక్: కట్నం ఇవ్వలేదని భార్య కిడ్నీనే అమ్మేశాడు
కోల్కతా: అత్తింటివారు కట్నం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా కట్టుకున్న భార్య కిడ్నీనే అమ్మేశాడు ఓ దుర్మార్గుడు. బాధితురాలు తాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. కోల్కతాకు చెందిన రీటా అనే ఓ యువతికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వరుడి తల్లిదండ్రులు భారీగానే కట్నం అడిగారు. దీంతో పెళ్లికి ముందు కొంత కట్నం ఇచ్చారు. మిగతాది తర్వాత ఇస్తామని చెప్పారు.
పెళ్లై ఏడాది గడుస్తున్నా మిగిలిన కట్నం ఇవ్వలేదని అత్తింటివారు రీటాను వేధించేవారు. కాగా, 2016లో రీటాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. పరీక్షల నిమిత్తం వైద్యులను సంప్రదించగా అపెండిసైటిస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ తరువాత మాటిమాటికీ అనారోగ్యం పాలవుతుండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది.
అక్కడి వైద్యులు రీటాకు ఒకే కిడ్నీ ఉందని తెలిసి షాకయ్యారు. 2016లో అపెండిసైటిస్ సర్జరీ చేసినప్పుడు రీటా భర్తే వైద్యులకు డబ్బు ఇచ్చి కిడ్నీ తొలగించేలా చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన రీటా.. భర్త దుర్మార్గంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రీటా భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.