జయలలిత వీడియో, నేడు హైకోర్టులో అమృత పిటిషన్, పళని, పన్నీర్ మాస్టర్ ప్లాన్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జయలలిత విషయంలో ఎప్పుడు ఏమి వినాల్సివస్తుందో అంటూ అమ్మ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే పళని, పన్నీర్ మాస్లర్ ప్లాన్ వేశారని సమాచారం.
మన్నార్ గుడికి కౌంటర్ !
జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదలైన మరసటి రోజే మన్నార్ గుడి మాఫియాకు కౌంటర్ ఇస్తూ బెంగళూరుకు చెందిన అమృత తాను అమ్మ కుమార్తె అంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం.
జయలలిత వీడియో ఎఫెక్ట్
జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో శశికళ తీసిన వీడియో ఇదే అంటూ టీటీవీ దినకరన్ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ బుధవారం 20 సెకన్ల వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
పళని, పన్నీర్ మౌనం
టీటీవీ దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియో విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనంగా ఉన్నారు. పన్నీర్ సెల్వం అయితే ఆ వీడియో విషయం పట్టించుకోకుండా శ్రీ శనిమహాత్మ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి వెళ్లారు.
మౌనం వెనుక ఇదే ప్లాన్
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనం వెనుక అమృత విషయం దాగిఉందని సమాచారం. టీటీవీ దినకరన్ వర్గానికి కౌంటర్ ఇస్తూ గురువారం అమృత మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని తమిళనాడు ప్రభుత్వానికి ముందే తెలుసని సమాచారం.
అదే ధైర్యం
తమిళనాడు ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తుందని ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత అమృత కర్ణాటక హైకోర్టులో కాకుండా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిసింది. అయితే అమృత విషయంలో తమిళనాడు ప్రభుత్వ పెద్దలు ఇంత వరకూ ఏ విధంగానూ స్పింధించలేదు.