బెంగళూరులో కుప్పకూలిన భవనం, ఆరు మంది మృతి, ప్రాణాలతో మూడేళ్ల చిన్నారి!
Recommended Video
బెంగళూరు: బెంగళూరులో వంట గ్యాస్ సిలిండర్ పేలి మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సంజనా (3) అనే చిన్నారి తీవ్రగాయాలై శిథిలాల కింద చిక్కుకోవడంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి, బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి కేజే, జార్జ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిని చిన్నారి సంజనా వైద్య ఖర్చులు మొత్తం కర్ణాటక ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి రామలింగారెడ్డి అన్నారు.
ఈ ప్రమాదంలో కళావతి (69), రవిచంద్రన్ (48), హరిప్రసాద్ (19), పవన్ కళ్యాణ్ (18), అశ్విని (గర్బిణి), శరవణ అనే ఆరు మంది మరణించారని పోలీసులు చెప్పారు. తీవ్రగాయాలైన వారు ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలతో బయటపడిన చిన్నారి సంజనా కుటుంబ సభ్యుల వివరాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించే సమయంలో గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ పరిహారంగా రూ. 5 లక్షలు ప్రకటిస్తున్నామని మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలడం వలనే మూడు అంతస్తుల కట్టడం కుప్పకూలిందని తాము కచ్చితంగా చెప్పలేమని, విచారణ జరుగుతోందని పోలీసులు అంటున్నారు.