శశికళే చంపింది: వీడిన మర్డర్ మిస్టరీ!.. ఆధారాలివే!
కి కప్ బోర్డులో శవాన్ని పెట్టి టేప్ అందించారు. రక్తం మరకలు అంటుకున్న దుస్తులను డ్రమ్ లో పెట్టి మూత వేశారు. కొద్దిరోజులకు కప్ బోర్డు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో.. ఇల్లు వదిలి పారిపోయారు.
బెంగళూరు: కడుపున పుట్టిన కూతురే కన్నతల్లిని బలితీసుకున్న ఘటన బెంగుళూరులోని కెంగేరి గాంధీనగర్ లో చోటు చేసుకుంది. హత్యానంతరం మృతదేహాన్ని ఇంటిలోని కప్ బోర్డులో దాచిపెట్టేశారు. అయితే అందులోంచి కొద్దిరోజులకు దుర్వాసన రావడంతో ఏకంగా ఇంటికే తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. శశికళ అనే వివాహిత ఆమె కుమారుడు సంజయ్, తల్లి శాంతకుమారిలతో కలిసి గాంధీనగర్ లోని ఓ అద్దె ఇంటిలో నివసిస్తోంది. గతేడాది అగస్టులో తల్లి కూతుళ్ల మధ్య ఏదో విషయంపై గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓరోజు అనుకోని ఘటన చోటు చేసుకుంది.
తల్లి శాంతకుమారికి శశికళ ప్లేటులో భోజనం పెట్టి అందించింది. అయితే తల్లి మాత్రం ఆ ప్లేటును కాలితో తన్నింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన శశికళ.. శాంతకుమారిని కర్రతో విచక్షణా రహితంగా బాదింది. దీంతో శాంతకుమారి అక్కడిక్కడే ప్రాణాలు విడవగా.. ఏం చేయాలో తోచని స్థితిలో మిత్రుడు నందీశ్ ను సంజయ్ ఇంటికి రప్పించాడు.
విషయం బయటకు పొక్కకుండా శవాన్ని మాయం చేయాలనుకున్నారు. ఒక నీటి డ్రమ్ లో శవాన్ని ఉంచి మట్టితో కప్పేయాలని భావించారు. కుదరకపోయేసరికి కప్ బోర్డులో శవాన్ని పెట్టి టేప్ అందించారు. రక్తం మరకలు అంటుకున్న దుస్తులను డ్రమ్ లో పెట్టి మూత వేశారు. కొద్దిరోజులకు కప్ బోర్డు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో.. ఇల్లు వదిలి పారిపోయారు.
కాగా, ఈ నెల 7న ఇంటి యజమాని వచ్చి తాళం తీసి చూడటంతో శాంతకుమారి అస్థిపంజరం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో సంజయ్ పోలీసులకు చిక్కగా.. తన తల్లి శశికళే ఈ హత్య చేసిందని అంగీకరించాడు. ప్రస్తుతం శశికళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.