మద్యం మత్తులో బీభత్సం: బస్సును ఛేజ్ చేసి భర్తను దించి తుపాకీతో కాల్చేసింది
పూటుగా మద్యం సేవించిన ఓ మహిళ.. ఆమె బారినుంచి తప్పించుకుని బస్సు ఎక్కిన తన భర్తను ఛేజ్చేసి పట్టుకుని, బస్సు దించేసి తుపాకీతో కాల్చేసింది. అంతేగాక, అడ్డుకునేందుకు వచ్చిన అక్కడివారిని తుపాకీతో భయభ్రాంతు
బెంగళూరు: పూటుగా మద్యం సేవించిన ఓ మహిళ.. ఆమె బారినుంచి తప్పించుకుని బస్సు ఎక్కిన తన భర్తను ఛేజ్చేసి పట్టుకుని, బస్సు దించేసి తుపాకీతో కాల్చేసింది. అంతేగాక, అడ్డుకునేందుకు వచ్చిన అక్కడివారిని తుపాకీతో భయభ్రాంతులకు గురిచేసింది. దగ్గరికి వస్తే కాల్చి పారేస్తానంటూ వీరంగం సృష్టించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
ఆమె కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హెచ్ఎస్ఆర్ లేఔట్లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిరామ్(53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్ రెసిడెన్సిలో శుక్రవారం సాయంత్రం సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు.
మార్గం మధ్యలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వాహనం వీరసంద్ర గేట్ సమీపంలోకి రాగానే భర్త సాయిరామ్ కారు దిగి బీఎంటీసీ బస్సు ఎక్కాడు. దీంతో ఆగ్రహించిన హంసవేణి.. కారును వేగంగా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపింది. భర్తను బలవంతంగా బస్సునుంచి కిందకు దింపి రివాల్వర్తో మూడుసార్లు కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి.
అక్కడున్నవారు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న బెంగళూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. సాయిరామ్కు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.