అక్క ప్రియుడు యముడైనాడు: బెంగళూరు ఐటీ శాఖ అధికారి కొడుకు హత్య కేసులో ట్విస్ట్ !
కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తీసుకున్న సందర్బంగా స్నేహితులకు స్వీట్స్ ఇవ్వడానికి వెళ్లిన బెంగళూరు ఐటీ శాఖ అధికారి కొడుకుని అతని స్నేహితులే కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
Recommended Video
బెంగళూరు: కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తీసుకున్న సందర్బంగా స్నేహితులకు స్వీట్స్ ఇవ్వడానికి వెళ్లిన బెంగళూరు ఐటీ శాఖ అధికారి కొడుకుని అతని స్నేహితులే కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. హంతకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
సొంత అక్క ప్రియుడి చేతిలో శరత్ (19) అనే విద్యార్థి హత్యకు గురైనాడని శుక్రవారం బెంగళూరులోని జ్ఞానభారతీ పోలీసులు చెప్పారు. శరత్ హత్య కేసులో అతని అక్క ప్రియుడు విశాల్, స్నేహితులు వినయ్, విక్కీ, కిరణ్, కర్ణా, శాంతకుమార్ అనే నిందితులను అరెస్టు చేశారు.
కొత్త బైక్, తల్లితో ఫోటోలు
బెంగళూరులోని ఆదాయపన్ను శాఖలో అధికారిగా పని చేస్తున్న నిరంజన్ కుమార్ కుమారుడు శరత్ ఈనెల 13వ తేదీన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనుగోలు చేశాడు. అదే రోజు సాయంత్రం శరత్ కొత్త బైక్ మీద కుర్చుని తన తల్లితో ఫోటోలు తీసుకున్నాడు.
ఫ్రెండ్స్ కోసం స్వీట్స్
కొత్త బైక్ తీసుకున్న సందర్బంగా స్నేహితులకు స్వీట్స్ ఇచ్చి వస్తానని చెప్పిన శరత్ కొత్త బైక్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో శరత్ మొబైల్ కు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. శరత్ మాత్రం ఫోన్ రిసీవ్ చెయ్యలేదు.
రూ. 50 లక్షలు డిమాండ్
అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో శరత్ మొబైల్ నుంచి ఓ వీడియో కాల్ అతని తండ్రి నిరంజన్ కుమార్ మొబైల్ కు వచ్చింది. ఆ వీడియోలో శరత్ మాట్లాడుతూ తనను ఎవరో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని, వెంటనే వారికి రూ. 50 లక్షలు ఇచ్చి తనను విడిపించాలని తండ్రిని వేడుకున్నాడు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తారు
పోలీసులకు మాత్రం ఫిర్యాదు చెయ్యరాదని, అలా చేస్తే తనను చంపేస్తారని శరత్ చెప్పాడు. ఆందోళన చెందిన శరత్ తండ్రి నిరంజన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శరత్ మొబైల్ నెంబర్ ను ట్రాప్ చేశారు. మైసూరు రోడ్డులో శరత్ మొబైల్ సిగ్నల్స్ వచ్చాయి. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా శరత్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
శరత్ అక్క ప్రియుడు
పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. శరత్ అక్క తోపాటు కాలేజ్ లో చదువుతున్న ఆమె ప్రియుడు విశాల్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు విశాల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసి బెండ్ తీశారు. శరత్ ను తామే హత్య చేశామని విశాల్ అంగీకరించాడు.
అక్క ప్రియుడిని గుర్తు పట్టాడు
శరత్ తన అక్కతో పాటు చదువుతున్న విశాల్ ను గుర్తుపట్టాడు. కుటుంబ సభ్యులకు శరత్ విషయం చెబితే అరెస్టు చేస్తారనే భయంతో అతన్ని చంపేసి హారోహళ్లి చెరువు సమీపంలో పూడ్చి పెట్టారని పోలీసులు చెప్పారు. శరత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.
అప్పులు, ప్రియురాలి తమ్ముడిని ?
శరత్ అక్క ప్రియుడు విశాల్ రూ. 5 లక్షలు అప్పు చేశాడని, దాన్ని తీర్చలేక నానా తంటాలు పడ్డాడని పోలీసులు అన్నారు. శరత్ తండ్రి నిరంజన్ కుమార్ కు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని, ఆయన దగ్గర డబ్బు ఎక్కువగా ఉందని తెలుసుకుని శరత్ ను కిడ్నాప్ చేస్తే డబ్బు వస్తుందని ప్లాన్ వేసి చివరికి అతన్ని చంపేశారని పోలీసులు తెలిపారు.