Disha murder case: దిశ హత్యోదంతం: ఇక మెట్రో రైళ్లల్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు..!
బెంగళూరు: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్ దిశ తరహా ఘోర కృత్యాలు చోటు చేసుకోకుండా ఉండటానికి పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) సైతం అడుగులు వేసింది.

మహిళా ప్రయాణికుల భధ్రతపై దృష్టి..
మెట్రో రైళ్లల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని బీఎంఆర్సీఎల్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బీఎల్ యశ్వంత్ చవాన్ వెల్లడించారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం అనంతరం.. మహిళా ప్రయాణికుల భద్రతపై తాము దృష్టి సారించాల్సి వచ్చిందని చెప్పారు.

స్వీయ రక్షణ కోసం..
మహిళా ప్రయాణికులు స్వీయ రక్షణ కోసం వాటిని వినియోగించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడంపై నిషేధం ఉండేదని, వాటిని తీసుకెళ్లే మహిళా ప్రయాణికులను రైలు ఎక్కడాన్ని నిరోధించేలా చర్యలు తీసుకునే వాళ్లమని చెప్పారు. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన చోటు చేసుకున్న తరువాత నిబంధనలను సడలించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు యశ్వంత్ చవాన్ తెలిపారు.

మెట్రో స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు..
మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తూ.. బెంగళూరులోని అన్ని మెట్రో స్టేషన్లకు సమాచారాన్ని పంపించినట్లు చెప్పారు. పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లే మహిళా ప్రయాణికులను అడ్డుకోవద్దని మెట్రో స్టేషన్ల భద్రతా సిబ్బందికి సూచనలు పంపామని అన్నారు. పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లొచ్చనే విషయంపై మహిళా ప్రయాణికులకు తెలియజేసేలా అన్ని మెట్రో స్టేషన్లలో బ్యానర్లను కట్టాలని భావిస్తున్నట్లు యశ్వంత్ చవాన్ తెలిపారు.

మండే స్వభావం ఉండటం వల్లే..
పెప్పర్ స్ప్రేకు మండే స్వభావం ఉంటుంది. అందుకే మెట్రో రైళ్లలో దాన్ని తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఒక్క బెంగళూరు మెట్రో రైళ్లలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఏ మెట్రో రైలులో కూడా దీన్ని తీసుకెళ్లడంపై అనుమతి లేదు. డాక్టర్ దిశ హత్యోదంతం అనంతరం నెలకొన్న పరిస్థితుల్లో ఈ నిషేధాన్ని ఎత్తేయాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగినులు విధి నిర్వహణలో భాగంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగిస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యశ్వంత్ చవాన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications