దారుణం: నీళ్లు ఎక్కువగా వాడాడని చితకబాది.. ఆపైన బూట్లు నాకించి..
నీళ్లు అధికంగా వాడిన పాపానికి తన ఇంట్లో అద్దెకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంటి యజమాని కొట్టడమేకాక, బూట్లు నాకించాడు.
బెంగళూరు: సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకున్న వారికి, ఇంటి యజమానికి ఏదో ఒక సందర్భంలో వివాదం రావడం సహజమే. అద్దెకుండే వారిపై అనేక ఆంక్షలు విధించడం పరిపాటే.
ఒకవేళ అద్దెకున్న వారికి, ఇంటి యజమానికిసరిపడకపోతే.. వార్నింగ్ ఇవ్వడమో, మహా అయితే ఖాళీ చేయించడమో చేస్తారు. కానీ ఏ ఇంటి యజమానీ ఇంత దారుణంగా మాత్రం ప్రవర్తించడు.
కానీ బెంగళూరులో ఓ ఇంటి యజమాని మాత్రం దారుణ చర్యకు ఒడిగట్టాడు. నీళ్లు అధికంగా వాడుతున్నారని ఆరోపిస్తూ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన విద్యార్థులపై దాడి చేశాడు. వారిని తీవ్రంగా కొట్టడమే కాకుండా వారితో బలవంతంగా బూట్లు నాకించాడు.
ఈ ఘటనపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటి యజమాని హేమంత్ కుమార్ పై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. అనంతరం హేమంత్ కుమార్ బెయిల్ పై విడుదలయ్యాడు.
ఈ ఘటనపై బాధిత విద్యార్థుల్లో ఒకరి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని, ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన వారిని వదలిపెట్టకూడదని ఆయన పేర్కొన్నారు.