షూటవుట్ ఎట్ బెంగళూరు: కాల్పుల మోత: చేతికి చిక్కన రౌడీ షీటర్లు: సినీ ఫక్కీలో కాల్పులు.. !
బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులో కాల్పుల మోతతో తెల్లారింది. చాలాకాలం పాటు పోలీసుల చేతికి చిక్కకుండా ముప్పతప్పలు పెడుతున్న ఇద్దరు రౌడీషీటర్లు బెంగళూరులో వీరంగం సృష్టించారు. తమను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ ఇద్దరు రౌడీషీటర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారికి సంకెళ్లు వేసి మరీ.. ఆసుపత్రికి తరలించారు.
మానవబాంబు అంటూ..మహిళ వీరంగం: 36 వేల అడుగుల ఎత్తున విమానంలో...
బెంగళూరులోని బీటీెఎం లేఅవుట్లో సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇద్దరు రౌడీషీటర్ల పేర్లు సతీష్, మహేష్. బెంగళూరులోని పలు పోలీస్స్టేషన్లలో వారి మీద కేసులు నమోదై ఉన్నాయి. రౌడీషీట్ తెరిచారు. అయిదారేళ్లుగా వారు భూధందాలకు పాల్పడుతున్నారు. కిడ్నాప్ చేస్తామంటూ బడా బాబులకు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నారు. వాంటెడ్ రౌడీలుగా ముద్ర ఉంది.
బీటీఎం లేఅవుట్ పరిధిలోని మైక్రో లే అవుట్, రంకా కాలనీలో గల ఓ నివాసం వారిద్దరూ తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు వల పన్నారు. సుమారు 20 మంది పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. సీసీబీ ఇన్స్పెక్టర్లు గళాద పునీత్, కేశవమూర్తి దీనికి సారథ్యాన్ని వహించారు. పోలీసులు తమను చుట్టుముట్టారనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే రౌడీ షీటర్లు కాల్పులు జరిపారు. కత్తులను విసిరారు.
ఈ ఘటనలో హనుమేశ్ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. దీనితో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. నిబంధనల ప్రకారం.. రౌడీషీటర్ల మోకాళ్లకు కింద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వారు గాయపడ్డారు. వారిని అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం చికిత్స కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రౌడీ షీటర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సతీష్పై ఎనిమిది, మహేష్పై ఆరు కేసులు నమోదై ఉన్నట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు.