ఐదేళ్ళ క్రితమే కుట్ర, జయకు వారిద్దరూ దగ్గరే, శశికళ నటరాజన్ దే పై చేయి
యాధృఛ్చికమే అయినా, జయకు సన్నిహితంగా ఉన్న ఇద్దరూ మహిళల పేర్లు శశికళ. శశికళ నటరాజన్ జయతోనే ఉన్నారు.
చెన్నై :యాధృచ్చికమే కావచ్చు. శశికళ పేరున్న మహిళలు జయలలితకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. వీరిలో ఒకరు ప్రస్తుతం పార్టీ నుండి సస్పెన్షన్ కు గురికాగా, మరోకరు చనిపోయేవరకు ఆమెతోనేఉన్నారు. చివరకు జయ అంత్యక్రియలను కూడ ఆమె నిర్వహించారు. గతంలో ఈమెను కూడ జయ కొంత కాలం దూరం పెట్టారు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని, తిరిగి జయ శశికళను చేరదీశారు.
జయకు సన్నిహితంగా ఆ ఇద్దరూ
ముఖ్యమంత్రిగాను విపక్షంలోనూ జయలలిత ఉన్న సమయంలో ఆమెతో సన్నిహితంగా ఇద్దరూ మహిళలు ఉండేవారు. వారి ఇద్దరి పేర్లుకూడ శశికళే కావడం విశేషం. చనిపోయేవరకు జయలలితతో అంటిపెట్టుకొని ఉంది శశికళ నటరాజన్. చాలా కాలం వరకు జయతోనే ఆమె ఉంది. అయితే గతంలో శశికళ నటరాజన్ ను జయ దూరం పెట్టారు. ఏం జరిగిందో ఏమో కాని, జయ ఆమెను తిరిగి దగ్గరకు తీశారు. కొంత కాలం దూరం పెట్టిన తర్వాత కూడ తిరిగి జయ వద్ద అదే స్థాయిలో శశికళ చక్రం తిప్పారు. మరో మహిళ శశికళ పుష్ప. ఈమె రాజ్యసభ సభ్యురాలు. ఇటీవల కాలంలో ఆమె పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆమె కూడ జయకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు.
ఒకరంటే మరోకరికి పడదు
జయలలిత అనారోగ్యంగా ఉన్న సమయంలో శశికళ నటరాజన్ పేరును ప్రస్తావించకుండానే శశికళ పుష్ప ఆమెపై పరోక్షంగా విమర్శలు చేశారు. అప్పటికే ఆమె పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు శశికళ నటరాజన్ ప్రయత్నిస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. జయ సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు.డిల్లీ ఎయిమ్స్ కు జయను తరలించాలని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై సిబిఐ తో దర్యాప్తు చేయించాలనిఆమె డిమాండ్ చేశారు.జయకుహని చేసేందుకే శశికళ నటరాజన్ ఐదేళ్ళ క్రితమే ప్రయత్నించారని శశికళ పుష్ప ఆరోపించారు. ఈ ఆరోపణలపై శశికళ నటరాజన్ మాత్రం స్పందించలేదు.
మేయర్ నుండి రాజ్యసభకు శశికళ పుష్ప
జయతో సాన్నిహిత్యమే శశికళ పుష్ప రాజకీయ భవితవ్యాన్ని మార్చేసింది. తుత్తుకడి మేయర్ గా ఉన్న శశికళ పుష్ప, జయతో సాన్నిహిత్యం కారణంగా ఏకంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. జయకు ఆమె అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జయ అంటే వీర అభిమాని. అమ్మ కారణంగానే 2014 లో ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. .జయ నివాసం పోయెస్ గార్డెన్ కు శశికళ పుష్ప నేరుగా వెళ్ళేంత సాన్నిహిత్యం ఉండేది కాని, ఏం జరిగిందో ఏమో కాని, ఆమె ప్రస్తుతం పార్టీ నుండి సస్సెన్షన్ కు గురయ్యారు.
ఇద్దరికీ పొసగదు
ఇద్దరిదీ ఒకటే పేరు, ఇద్దరూ కూడ జయకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అయితే వీరిద్దరికీ మాత్రం పడడం లేదు. కారణాలు మాత్రం బయటకు రాలేదు. అయితే పార్టీ తన పై వేటు వేసిన తర్వాత పార్టీపై శశికళ పుష్ప ఆరోపణలు చేశారు. శశికళ నటరాజన్ పై శశికళ పుష్ప మాత్రం తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జయ ఆసుపత్రిలో ఉన్నసమయంలోనే శశికళ పుష్ప చేసిన ఆరోపణలు సంచలనం కల్గించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో డిఎంకె ఎంపి తిరుచ్చి శివను ఆమె చెంపమీద కొట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనను ఆసరాగాచేసుకొని శశికళ పుష్పపై పార్టీ వేటు వేసింది.అయితే రాజ్యసభలో ఆమె ఏడ్చారు. తనకు ప్రాణభయం ఉందని పరోక్షంగా జయ పేరును ప్రస్తావించకుండానే ఆమె రక్షణ కావాలని శశికళ పుష్ప కోరారు.
శశికళ నటరాజన్ పై చేయి
ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటిలో శశికళ నటరాజన్ పై చేయి సాధించారు. శశికళ పుష్ప మాత్రం పార్టీ నుండి సస్సెన్షన్ కు గురయ్యారు. జయ మరణించారు. అయితే శశికళ పార్టీని తన చేతిలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీలోని ఇతర నాయకులు ఏ రకంగా స్పందిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు శశికళ పుష్ప తిరిగి పార్టీలోకి వస్తారా అనేది ప్రశ్నార్థకమే .