పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ ప్రమాణం: ప్రాధాన్యతలివే
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్లో..వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్కు ఆయన 18వ ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇన్ఛార్జ్ రాఘవ్ ఛద్దా హాజరయ్యారు.
Recommended Video
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే భగవంత్ మాన్- షహీద్ భగత్సింగ్ను స్మరించుకున్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. భారత్కు మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కల్పించాలని భగత్ సింగ్ కలలుగన్నారని చెప్పారు. వాటిని సాకారం చేస్తామని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు, ఆమ్ ఆద్మీకి ఉన్న తేడా ఏమిటో తన పరిపాలన ద్వారా పంజాబ్ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఖట్కర్ కలాన్ను ఎంచుకోవడం కూడా ఇందులో భాగమేనని చెప్పారు. పంజాబ్లో అనేక రంగాల్లో సమస్యలు పేరుకుపోయాయని, వాటన్నింటినీ సమూలంగా పరిష్కరిస్తానని అన్నారు. నిరుద్యోగం నుంచి వ్యవసాయం దాకా, చిరు వ్యాపారుల దగ్గరి నుంచి పాఠశాలల దాకా ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి జీవం పోయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని భగవంత్ మాన్ చెప్పారు.
ప్రతి రైతు కుటుంబానికీ మేలు చేసేలా తక్షణ చర్యలను తీసుకుంటానని అన్నారు. అవినీతి రహిత పరిపాలనను అందించడం, నిరుద్యోగాన్ని రూపుమాపడంపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ అభివృద్ధిని ప్రతిబింబించేలా ఇక్కడి పరిపాలన సాగుతుందని చెప్పారు. ఆ నమ్మకం ఉండటం వల్లే పంజాబీయులు తమ పార్టీకి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని అప్పగించారని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని భరోసా ఇచ్చారు.
పరిపాలనలో తర, తమ అనే భేదాలు చూడమని భగవంత్ మాన్ అన్నారు. తమకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాల లబ్ది అందుతుందని హామీ ఇచ్చారు. అతి త్వరలోనే పంజాబ్..
సమ్మిళిత అభివృద్ధికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఇక్కడి వారు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తానని అన్నారు. ఏ ఒక్కరు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థిత ఉండదని అన్నారు. ఈ మట్టిని ప్రేమించడం ప్రతి ఒక్క భారతీయుడి జన్మహక్కుగా అభివర్ణించారు.