భారత్ బంద్ హైజాక్ -రైతు పిలుపుపై పార్టీల రాజకీయం -కొన్ని రాష్ట్రాల్లోనే ఎఫెక్ట్ -రాజధానుల్లో నార్మల్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు అన్నదాతల నడ్డి విరిచేలా, కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టేలా ఉన్నాయని ఆగ్రహిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాల్ని కేంద్రం వాపస్ తీసుకోవాలంటూ రైతులు చేస్తోన్న పోరాటంలో భాగంగా 13వరోజైన మంగళవారం 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. రైతు సంఘాలు ఇచ్చిన ఈ పిలుపునకు బీజేపీ యేతర 24 పార్టీలు మద్దతు తెలిపాయి. వాటిలో కొన్ని.. పార్లమెంటులో అగ్రి చట్టాలను సమర్థించిన పార్టీలు కూడా ఉన్నాయి. రైతుల పిలుపును రాజకీయ పార్టీలు హైజాక్ చేసిన దృశ్యాలు పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించాయి. మొత్తంగా..

జనజీవనంపై ఎఫెక్ట్
భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం ఎఫెక్టయింది. హైవేల దిగ్బంధనం, దుకాణాలు, మార్కెట్ల మూసివేతతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ సూపర్ సక్సెస్ అయింది. పంజాబ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిచింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంమే స్కూళ్లు, రవాణా సదుపాయాలను నిలిపేయడం గమనార్హం. బంద్ కు నో చెప్పిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. గుజరాత్ లోని పలు హైవేలపై నిరసనకారులు టైర్లు తగులబెట్టారు. అన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాలు, వామపక్ష పార్టీల కార్యకర్తలు రైలు పట్టాలు, రోడ్డు కూడళ్ల మధ్య బైఠాయించి నిరసనలు తెలిపారు.

మొత్తంగా బంద్ సాధారణం..
కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం తప్ప ఓవరాల్ గా మంగళవారం నాటి భారత్ బంద్ సాధారణంగా జరిగింది. అత్యవసర సేవలతోపాటు బ్యాంకులకు కూడా బంద్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో దేశమంతటా ఇవాళ బ్యాంకులు యధావిధిగా పనిచేశాయి. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మధ్యాహ్నం 3 గంటలవకు అన్నీ మూతపడగా, మిగతా రాష్ట్రాల్లో మార్కెట్లు, ప్రజా రవాణా యధావిధిగా కొనసాగాయి. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి అంతా నార్మల్ గా సాగింది. ప్రతిరోజులాగే ట్రాఫిక్ కొనసాగింది. పలు రాష్ట్రాల నుంచి ఇంకొందరు రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుతుండటంతో అక్కడ భారీగా పోలీసులు, కేంద్రబలగాలను మోహరించారు. ఇదిలా ఉంటే..

రైతుల్ని హైజాక్ చేసిన పార్టీలు
కడుపుమంటతో అన్నదాతలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపును రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనానికి వాడుకున్నట్లు మంగళవారం చోటుచేసుకున్న సంఘటనలతో వెల్లడైంది. చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు బల ప్రదర్శనలా బంద్ నిర్వహించాయే తప్ప రైతులను, రైతు సంఘాలను కలుపుకొని పోలేదు. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను సమర్థించిన పార్టీలు కొన్ని యూటర్న్ తీసుకుని భారత్ బంద్ కు మద్దతు పలకడం, రైతులకు అండగా ఉంటామని ప్రకటనలివ్వడాన్ని సాధారణ జనం తప్పుపట్టారు. రైతుల పాలిట ఛాంపియన్ మేమేంటే మేము అన్నట్లుగా పార్టీలు వ్యవహరించాయి. వ్యవసాయ చట్టాలపై తొలి నుంచీ సైలెంట్ గా ఉండిపోయిన రాజకీయ పార్టీలు.. రైతుల బలమైన పోరాటం తర్వాతగానీ నిరసనల్లో గొంతు కలపలేకపోయాయి. భారత్ బంద్ సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు గొడవలకు దిగడం, ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈలోపే..

దిగొచ్చిన కేంద్రం.. వీటిని మార్చుతుందా?
భారత్ బంద్ సందర్భాన్ని పార్టీలు తమ రాజకీయం కోసం వాడుకున్నా, సాధారణ ప్రజలు మాత్రం రైతుల పోరాటానికి సంఘీభావం తెలపడం గమనార్హం. ఐటీ, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు రైతుల నిరసనలకు మద్దతుగా పలు చోట్ల ప్రదర్శనలు చేశారు. మొత్తంగా చెప్పుకోదగిన విధంగానే భారత్ బంద్ ప్రభావం చూపడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. రైతు సంఘాల నేతలతో బుధవారం ఆరో దఫా చర్చలకు సిద్ధమని కేంద్రం మంగళవారం ఓ ప్రకటన చేసింది. అయితే, రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు ఆ మూడు చట్టాలను.. 1)రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం, 2) నిత్యావసర సరకుల (సవరణ) చట్టం, 3)రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మధ్యేమార్గంగా కొన్ని సవరణలకు కేంద్రం అంగీకరించే వీలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications