కుప్పకూలిన భవనం.. 33కి పెరిగిన మృతుల సంఖ్య... 48గం. గడిచినా కొనసాగుతున్న సహాయక చర్యలు
మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 20కి పెరిగింది. మంగళవారం(సెప్టెంబర్ 22) నాటికి మృతుల సంఖ్య 20కి పెరిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించగా... ఒక్కరోజు వ్యవధిలోనే మరో 13 మృతదేహాలను వెలికితీయడం గమనార్హం. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. శిథిలాలను ఇంకా పూర్తిగా తొలగించకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మృతుల్లో జుబేర్ ఖురేషీ,ఫైజా ఖురేషీ,అయేషా ఖురేషీ,సిరాజ్ అబ్దుల్ షేక్,ఫాతిమా జుబేరా,సిరాజ్ అహ్మద్ షేక్ తదితరులు ఉన్నట్లు థానే మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది. ఈ భవనంలో మొత్తం 40 ఫ్లాట్స్ ఉండగా అందులో 150 మంది నివసిస్తున్నట్లు తెలిపింది. శిథిలాల చిక్కుకుపోయినవారిలో ఇప్పటివరకూ 20 మందిని రక్షించినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ సత్య ప్రధాన్ తెలిపారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా మృతులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి ఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. భవన యజమానిపై కూడా కేసు నమోదైంది. 30ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ శాఖ నోటీసులు ఇచ్చినప్పటికీ... సదరు యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
Recommended Video
కాగా,సోమవారం(సెప్టెంబర్ 21) తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మొదటిరోజు శిథిలాల కింద నుంచి 10 మంది మృతదేహాలను వెలికితీశారు. గత రెండు రోజులుగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.