ఎంగేజ్మెంట్ రద్దైందని మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వాతి పాండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మే నెలలో జరుగాల్సిన ఎంగేజ్మెంట్ రద్దు అవడంతో మనస్తాపానికి లోనైన స్వాతి పాండే ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
పాండే తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్ అధికారి అజిత్ మిశ్రా తెలిపారు. స్వాతి పాండే ఇటీవలే హిస్టరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినట్టు పేర్కొన్నారు.
జానకీనగర్లోని తన నివాసంలో ఉరివేసుకొని పాండే ఆత్మహత్య చేసుకున్నారని.. ఉదయం ఆమె తల్లిదండ్రులు గమనించేప్పటికే ఆమె ప్రాణాలు వదిలిందని తెలిపారు.
కాగా, మే 9న జరగనున్న తన ఎంగేజ్ మెంట్ రద్దవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పాండే తన ఆత్మహత్య లేఖలో పేర్కొందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.