సూపర్ 6 + 1: బిగ్ ప్లాన్
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ బహిరంగ సభలు, రోడ్ షోలు హోరెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ-జన్ నాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమి, ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీపై పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఒకే దశలో పోలింగ్ షెడ్యూల్ అయింది హర్యానాలో. అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ పోల్ అయిన ఓట్లను కూడా అదే రోజున లెక్కిస్తారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 జనరల్ సీట్లు. 17 స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్.
ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పక్కా వ్యూహాలను పన్నింది కాంగ్రెస్. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- జన్నాయక్ జనతా పార్టీ కూటమిని ఓడించడానికి అవసరమైన హామీలను ప్రజలపై కురిపిస్తోంది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఓటర్లకు అనేక వరాలను ప్రకటించింది.
ఏడు గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతోన్నామని, ఆ వెంటనే హామీలను అమలు చేస్తామని చెప్పారు.
ఈ ఏడు గ్యారంటీల్లో 1. మహిళా శక్తి: మహిళలకు ప్రతి నెలా 2,000 రూపాయల ఆర్థిక సహాయం. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా, 2. సామాజిక భద్రత పెన్షన్లు: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రతి నెలా 6,000 రూపాయల పింఛన్ చెల్లింపు. ఓపీఎస్ పునరుద్ధరణ ఉన్నాయి.
3. యువత భవిష్యత్తుకు భరోసా: ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీ. మద్య నిషేధం అమలు. డ్రగ్ రహిత హర్యానా తీర్చిదిద్దుతామంటూ హామీ, 4. ప్రతి కుటుంబానికి ఫ్రీ కరెంట్: ప్రతి నెలా ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా. 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీ హామీ ఇచ్చింది కాంగ్రెస్.
5. పేదలకు సొంతిల్లు: పేదలకు 100 గజాల ఇంటి స్థలం కేటాయింపు. 3.5 లక్షల రూపాయలతో రెండు గదుల ఇంటి నిర్మాణం. 6. రైతులకు చేయూత: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. పంట నష్టపరిహారం తక్షణమే చెల్లింపు. 7. బీసీలకు వరాలు: కులగణనకు హామీ. క్రీమీలేయర్ పరిధి 10 లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపింది.












Click it and Unblock the Notifications