రాహుల్ కు అండగా స్టాలిన్-సొంతపార్టీ నేతల కంటే ఎక్కువగా అభిమానిస్తూ-అన్నగా పేర్కొంటూ
దేశంలో బీజేపీ సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని తిరిగి ఏకం చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ సుదీర్ఘ యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ లో అగ్రనేతల నుంచి లభించిన మద్దతు కంటే ఓ మిత్రపక్ష పార్టీ సీఎం ఇస్తున్న మద్దతు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కన్యాకుమారిలో నిన్న రాహుల్ యాత్రకు త్రివర్ణ పతాకాన్ని అందించి శుభాశీస్సులు అందజేసిన స్టాలిన్.. కాంగ్రెస్ నేతలకు సైతం కన్నుకుట్టేలా చేశారు.

కష్టాల ఊబిలో రాహుల్
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తన సొంత పార్టీతో పాటు బయటి నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారని సొంత నేతల నుంచి, ప్రధానిపై విమర్శలు, నిత్య వ్యవహారశైలిపై బీజేపీ వంటి ప్రత్యర్ధుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ దుస్ధితికి కారణంగా కూడా రాహుల్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ పార్టీని వీడే ప్రతీ నేత రాహుల్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు ఈడీ, సీబీఐ దాడులతో కాంగ్రెస్ యువనేత ఉక్కిరిబిక్కిరివుతున్నారు.
ఇలాంటి పరిస్ధితుల్లో రాహుల్ గాంధీ .. చివరి అస్త్రంగా భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.

రాహుల్ కు అండగా స్టాలిన్
ఇలాంటి స్ధితిలో రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం, తమ మిత్రపక్షం డీఎంకే అధినేత కూడా అయిన ఎంకే స్టాలిన్ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర చేయాలన్న నిర్ణయానికి రాగానే కన్యాకుమారిలో స్టేట్యూ ఆఫ్ యూనిటీ వద్ద దీన్ని మొదలుపెట్టాలని సలహా ఇవ్వడమే కాకుండా ప్రారంభోత్సవంలోనూ అన్నీ తానే అయి చూసుకున్నారు స్టాలిన్. రాహుల్ గాంధీకి స్వయంగా జాతీయ పతాకం అందించి భారత్ జోడో యాత్రను ప్రారంభించేందుకు సహకరించారు. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోయారు.
సొంత నేతలే టార్గెట్ చేస్తున్న వేళ
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంలేదంటూ జీ23 నేతలు సోనియాగాంధీకి లేఖ రాసి విమర్శలు ఎక్కుపెడుతున్నా, వీరిలో కొందరు ఇప్పటికే పార్టీని వీడిపోయినా రాహుల్ చలించడం లేదు. ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు పిలిచినా తన తల్లి సోనియా గాంధీతోపాటు వెళ్లి హాజరయ్యారు. అదే సమయంలో తనకు అండగా నిలిచేందుకు సైతం కాంగ్రెస్ అగ్రనేతలు జంకారు. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు, యువజన విభాగం అండగా నిలిచింది. ఇలాంటి పరిస్ధితుల్లో రాహుల్ గాంధీకి స్టాలిన్ అందించిన సహకారం రాహుల్ గాంధీని సైతం ఆకట్టుకుంది. దీంతో స్టాలిన్ తో కలిసి రాహుల్ నిన్న ఉత్సాహంగా కనిపించారు.
రాహుల్ ను సోదరుడిగా సంబోధించిన స్టాలిన్
రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టగానే దీన్ని కేవలం తమ మిత్రపక్ష నేత చేపడుతున్న ఓ సాదాసీదా యాత్రగా తీసుకోని స్టాలిన్.. అన్ని విధాలా సహకరించారు. ఈ సందర్భంగా కన్యాకుమారి తీరంలో జరిగిన బహిరంగసభ విపక్షాల ఐక్యతా చిహ్నంగా నిలిచింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో సమానంగా స్టాలిన్ కు రాహుల్ గౌరవమిచ్చిన తీరు కూడా చూపరుల్ని ఆకర్షించింది. అదే సమయంలో స్టాలిన్ కూడా రాహుల్ ను సోదరుడిగా సంభోదిస్తూ పెట్టిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. కీలక సమయంలో స్టాలిన్ అందిస్తున్న సహకారం రాహుల్ గాంధీకి భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేలా ఉంది.ఎందుకంటే ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడో పోతాయో తెలియని మిత్రపక్షాలతో కలిసి అతుకుల బొంత కాపురం చేస్తున్న కాంగ్రెస్ కు డీఎంకే ఇస్తున్న మద్దతు ఇప్పుడు విపక్షాల ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications