జమ్మూలో భారీ చొరబాటుకు బ్రేక్.. ! ఏడుగురు తీవ్రవాదుల కాల్చివేత..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ ఎదురుదాడులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు భారత్ లోని సరిహద్దు నగరాలపై డ్రోన్లు పంపుతూ దాడులకు చేస్తున్న ప్రయత్నాల్ని ఆర్మీ ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో దిక్కుతోచని స్దితిలో పడుతోంది. అదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి తీవ్రంగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్ని అడ్డుపెట్టుకుని భారత్ లోకి ఉగ్రవాదుల్ని చొప్పించేందుకు చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని సరిహద్దు భద్రతా దళం ( బీఎస్ఎఫ్) సమర్ధంగా అడ్డుకుంది. అంతే కాదు ఏడుగురు ఉగ్రవాదుల్ని కూడా హతమార్చింది. పాకిస్తాన్ రేంజర్ల సాయంతో సాంబా సెక్టార్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు ప్రకటించాయి. సరిహద్దుల్లోని పాకిస్తాన్ పోస్టు ధంధార్ పై దాడి చేయడంతో పాటు ఈ ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు తెలిపాయి.

నిన్న రాత్రి జమ్మూ, జైసల్మేర్ తో పాటు పలు చోట్ల డ్రోన్ దాడులకు ప్రయత్నించి విఫలమైన తర్వాత సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో కీలకమైన సమయంలో దేశంలోకి అంతే కీలకమైన ఓ చొరబాటును ఆర్మీ సమర్ధంగా అడ్డుకున్నట్లయింది. ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులతో అక్కడి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో చాలా మందిని ఇప్పటికే భారత సైన్యం అక్కడి నుంచి తరలించింది. దీంతో పాకిస్తాన్ దాడుల్లో సరిహద్దుల్లో ఇళ్లు దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications