ఢిల్లీ నిరసనల బాధితుడితో నేరుగా స్టేషన్ కు రాహుల్..! షాకైన పోలీసులు..!
ఢిల్లీలో జులై 20న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల (Delhi Cjp Protests) సందర్భంగా పెల్లెట్ గన్ గాయాలకు గురైనట్లు భావిస్తున్న ఒక యువకుడితో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీంతో స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. సాహిల్ లోచాబ్ అనే సదరు యువకుడితో పాటు మరికొందరిని తీసుకుని రాహుల్ గాంధీ నేరుగా పోలీసు స్టేషన్ కు రావడంతో అక్కడ ఉన్న అధికారులు షాకయ్యారు.
ఢిల్లీ నిరసనల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విద్యార్ధుల్ని అడ్డుకునేందుకు లాఠీచార్జ్, భాష్పవాయువు ప్రయోగాలు, వాటర్ క్యానన్ల వాడకం, పెల్లెట్ల ప్రయోగం చేసింది. అయితే పెల్లెట్లు ప్రయోగించలేదని ముందు అబద్దాలు చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో అంగీకరించారు. అయినా ఇప్పటివరకూ పోలీసులపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. విద్యార్దులపై మాత్రం కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెల్లెట్ల ప్రయోగం చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాధిత విద్యార్ధి సాహిల్ తో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు వెళ్లారు.

అయితే పోలీసులు పెల్లెట్ గన్ల ప్రయోగం చేసిన ఆర్ఏఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్దే ధర్నాకు దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసే వరకూ అక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. దీంతో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ వచ్చారని తెలియడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివస్తున్నారు. పోలీసులు తదుపరి చర్యలపై ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications