mohammed zubair: జుబైర్ కు సుప్రీంలో ఊరట-అన్నికేసుల్లోనూ బెయిల్-తక్షణ విడుదలకు ఆదేశం
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు, ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ కు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ దాఖలు చేసిన అన్నికేసుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు యోగీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్పై ఉన్న అన్ని కేసుల్లో అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ, వెంటనే అతన్ని కస్టడీ నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. జుబైర్పై ఉన్న అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు బదిలీ చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2018లో హిందూ దేవతకు వ్యతిరేకంగా ఆయన పోస్ట్ చేసిన అభ్యంతరకర ట్వీట్కు సంబంధించిన ప్రత్యేక కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్లో తనపై నమోదైన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ జుబైర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, "మాకు ఎటువంటి కారణం., సమర్థన కనిపించడం లేదు. పిటిషనర్ను అన్ని కేసుల్లో ఆర్టికల్ 32 ప్రకారం వెంటనే బెయిల్పై విడుదల చేయాలని నిర్దేశిస్తున్నాము" అని పేర్కొంది. జుబేర్ పై యూపీలోని యోగీ సర్కార్ పెట్టిన మతపరమైన మనోభావాలను కించపరిచారనే ఆరోపణల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
2018లో పోస్ట్ చేసిన అభ్యంతరకర ట్వీట్పై ఢిల్లీలో జుబైర్పై నమోదైన కేసుతో పాటు, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, ముజఫర్నగర్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్ హత్రాస్, చందోలిలో అతనిపై మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని .. దర్యాప్తు పరిధి కూడా చాలా పెద్దదని ధర్మాసనం పేర్కొంది. జులై 12న సుప్రీంకోర్టు, తదుపరి జూలై 15న పాటియాలా హౌస్ కోర్టు మంజూరు చేసిన ఉపశమనంతో ఇప్పటికీ పిటిషనర్ను జ్యుడీషియల్ కస్టడీలో లేదా పోలీసు రిమాండ్ దరఖాస్తులో ఉన్న వరుస విచారణలలో చిక్కుకుపోయిందని కూడా ధర్మాసనం పేర్కొంది.