యంగెస్ట్ సీఎంగా ఆ యువనేత: కౌంటింగ్కు ఒక్కరోజు ముందు 31వ బర్త్డే: తెల్లారడమే ఆలస్యం
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ యువనేత తేజస్వి యాదవ్ చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. దేశంలో అతి పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నేతగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో సమయం అక్కర్లేదు. కౌంటింగ్కు ఒక్కరోజు ముందు ఆయన తన పుట్టిన రోజు వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఆయన వయస్సు 31 సంవత్సరాలే. సోమవారం ఆయన తన 31వ జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటున్నారు.
కౌంటింగ్ ముందురోజు..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ మంగళవారం ఉదయం ఆరంభం కాబోతోంది. ఈ ఎన్నికల్లో బిహారీలు రాష్ట్రీయ జనతాదళ్ సారథ్యంలోని మహాకూటమికి పట్టం కట్టాయంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్.. హంగ్ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పాయి. అయినప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా జేడీయూ ఆవిర్భవిస్తుందని తేల్చి చెప్పాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆర్జేడీ వైపే మొగ్గు చూపాయి.

మూడొంతుల మెజారిటీ..
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో జేడీయూ కూటమికి మూడొంతుల మెజారిటీ లభించే అవకాశం ఉందంటూ అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ రూపాన్ని దాల్చితే.. ఆర్జేడీ కూటమి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అదే జరిగితే- ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినట్టవుతుంది. దేశంలోకెల్లా అతి తక్కువ వయస్సులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతగా ఆవిర్భవిస్తారు.
31 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రిగా..
జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ కూటమి కొమ్ములు వంచిన యువనేతగా తేజస్వి యాదవ్ గుర్తింపు పొందుతారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన బీజేపీ అగ్రనేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి వారు.. 31 సంవత్సరాల వయస్సున్న ఓ యువనేత చేతిలో పరభవాన్ని చవి చూసినట్టవుతుంది. ఇది సాధ్యపడుతుందా? లేదా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. మంగళవారం మధ్యాహ్నానికి బిహార్లో ఎవరు పాగా వేస్తారనేది స్పష్టమౌతుంది.
Recommended Video

కుటుంబంలో ఆనందోత్సాహాలు..
కాగా- తేజస్వి యాదవ్కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఆయన జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించుకుంటున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, తేజస్వి తల్లి రబ్రీ దేవి, సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, సోదరి మీసా భారతి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. ఇదిలావుండగా.. బిహార్లో 63 శాతం మంది ఓటర్లు మార్పును కోరుకుంటున్నట్లు టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది. జేడీయూ-బీజేపీ కూటమి ఓట్ల శాతం భారీగా క్షీణించిందని అంచనా వేసింది. ఆర్జేడీ మహాకూటమికి 169-191 వరకు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications