నితీష్ కుమార్కు రిటైర్మెంట్ ఖాయం: విశ్రాంతికి టైమందంటూ తేజశ్వి యాదవ్ సెటైర్లు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. తాజాగా, మరోసారి ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు.
మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్
నితీష్ కుమార్ ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించే స్థితిలో లేరని, ఆయనకు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని రాష్ట్రీయ జనతా దల్(ఆర్జేడీ) నేత తేజశ్వి యాదవ్ వ్యాఖ్యానించారు. నితీష్కు ఈ ఎన్నికల్లో రిటైర్మెంట్ ఖాయమని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా తమకు సేవ చేయడానికి అవకాశం కల్పించాలని ఆర్జేడీ నాయకుడు ప్రజలను కోరారు.
బీహార్ రాష్ట్రంలో పోలీసుల కొరత భారీగా ఉందని, లక్ష మంది ప్రజలకు కేవలం 77 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని తేజశ్వి తెలిపారు. ఖాళీలను భర్తీలను చేయడంలో నితీష్ సర్కారు విఫలమైందన్నారు. 15ఏళ్లలో నితీష్ చేయలేనిది తాము చేసి చూపిస్తామని అన్నారు. నితీష్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజశ్వి యాదవ్ ఉన్న విషయం తెలిసిందే.
వలస కార్మికులకు ఉపాధి కల్పించడంలో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజశ్వి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ, జేడీయూలు తేజశ్వి హామీలపై విమర్శలు చేస్తున్నాయి. అసాధ్యమైన హామీలిస్తున్నారన్నారు. తేజశ్వికి 10 లక్షల ఉద్యోగాలు కల్పించడం అసాధ్యమని నితీష్ అన్నారు. డబ్బే లేనప్పుడు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే ఏడాదికి రూ. 1.44 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నితీష్ తెలిపారు.
అక్టోబర్ 28న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రెండో దశలో 94 సీట్లకు నవంబర్ 3, 78 స్థానాలకు నవంబర్ 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఇక నవంబర్ 10 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.