చున్నీతో.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. బాలిక దారుణ హత్య
పాట్నా : బీహార్ లో నేరాలు అడ్డు అదుపు లేకుండా.. రోజురోజుకు పెరగిపోతూనే ఉన్నాయి. తాజాగా ముగ్గురు ఆకతాయి యువకులు ఓ బాలికను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన బీహార్లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఫక్రాబాద్ గ్రామానికి చెందిన 15 ఏళ్ళ మైనర్ బాలిక స్ఠానికంగా పదో తరగతి చదువుతోంది. మంగళవారం నాడు సహచర విద్యార్థినులతో కలిసి పరీక్షలు రాసేందుకు ఇంటినుంచి బయలుదేరింది. ఇదే క్రమంలో వెనుక వైపు నుంచి బైక్స్ పై రయ్యిమని దూసుకొచ్చిన ముగ్గురు ఆకతాయి యువకులు.. బాలిక మెడలోని చున్నీని లాగారు.
దీంతో ఒక్కసారిగా రోడ్డ మీద పడిపోయింది బాలిక. అనంతరం ఆమెను అలాగే 50మీటర్లు వరకు ఈడ్చుకెళ్లిన దుర్మార్గులు.. ఆమె పైనుంచి బైక్ ను స్పీడ్ గా పోనివ్వడంతో.. తీవ్రగాయాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆకతాయి యువకులు చేసిన ఈ ఘోరాన్ని భయపడిపోయిన సహచర విద్యార్థినులు.. స్థానికులకు వెంటనే సమాచారం అందించారు. దీంతో కొద్ది దూరం ఆ యువకుల బైక్స్ ను వెంబడించారు గ్రామస్తులు.
ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి ఓ గొయ్యిలో పడడంతో.. బైక్ ను అక్కడే వదిలేసి ముగ్గురు అక్కడినుంచి పరారయ్యారు. ఘటనానంతరం బైకులను తగలబెట్టేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు.. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు.
యువకులు వేసుకొచ్చిన బైక్ బిజ్రేష్ గుప్తా పేరుతో రిజిష్టర్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. బాలిక తండ్రి ఫిర్యాదుతో కిషోర్ కుమార్తో పాటు అతడి స్నేహితులైన ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసుల వేట కొనసాగుతోంది.