బీహార్ సీఎం నితీష్ కుమార్ కొత్త వ్యూహం?
2024 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించడమే తన లక్ష్యమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. పాట్నాలో జేడీయూ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో నితీష్ మాట్లాడారు. తనకు ప్రధానమంత్రి కావాలని లేదన్నారు. అలాగే మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశం కూడా లేదన్నారు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని తేల్చి చెప్పారు. నితీశ్ ప్రకటనతో ఆర్జేడీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. బీహార్లో కొంతకాలం క్రితం వరకు భారతీయ జనతాపార్టీతో కలిసి అధికారం పంచుకున్న నితీష్ కుమార్ అనూహ్యంగా కూటమి నుంచి బయటకు రావడంతోపాటు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా నితీష్ పావులు కదుపుతున్నారు. ఎన్డీయేతర పార్టీలతోను, యూపీయేతర పార్టీలతోను ఆయన చర్చలు జరుపుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని నితీష్ ప్రకటించారు. విపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
విపక్షాలతో ఏర్పడే కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలనేది నితీష్ షరతు. అయితే ఈ షరతుకు కేసీఆర్ నిరాకరించినట్లు సమాచారం. 2023లో జరిగే తెలంగాణ ఎన్నికల తర్వాతే ఆయన నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే జేడీఎస్ అధినేత కుమారస్వామి కూడా కేసీఆర్ తోపాటే ఉన్నారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తటస్థంగా ఉన్నారు. మమతా బెనర్జీ కూడా విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఉండటాన్ని వ్యతిరేకించడంలేదు.. అలా అని సమర్థించనూ లేదు. లోక్ సభ ఎన్నికలు దగ్గరకు వస్తేకానీ విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వస్తాయా? లేదా? అనేది స్పష్టత రాదు. అప్పటివరకు వేచిచూడటమే.