బీహార్లో కుల చిచ్చు: ఎన్డీయేకు నితీష్ గుడ్బై చెప్తారా..ఏం జరుగుతోంది..?
బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొంటారా..? కులగణన అంశంపై అసంతృప్తితో ఉన్నారా..? కులగణన అంశంపై సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసిన మూడు రోజులకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణన అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఇంతకీ ఏం జరిగింది...?
కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా బీహార్ మారింది. బీహార్లో కులగణన జరగాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే ఇది సాధ్యపడదని కేంద్రం వెల్లడించింది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విషయం పై కేంద్రం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో కులగణన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్లో కులగణన ప్రారంభిస్తే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని అదే సమయంలో రాజకీయంగా కూడా నష్టం చేకూరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఇది ఆచరణలో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని పరోక్ష వార్నింగ్ ఇచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్.
ఇక ఇప్పటికే కులగణన అంశంపై అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రం వద్దకు పంపామని.. కానీ కేంద్రం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదని నితీష్ కుమార్ చెప్పారు. అన్ని పార్టీలు సంయుక్తంగా తమ డిమాండ్ను కేంద్రంకు వివరించినట్లు నితీష్ కుమార్ ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు. ఇక సామాజిక-ఆర్థిక కుల గణన అంశం కోర్టుకు చేరినందున మరో సారి తెరపైకొచ్చింది. అయితే తమ డిమాండ్కు కోర్టులో ఉన్న అంశానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. కులగణన చేపట్టకూడదన్న కేంద్ర నిర్ణయాన్ని మాత్రమే తాము తప్పుబడుతున్నట్లు నితీష్ చెప్పుకొచ్చారు.
ఇక కులగణన అంశం అగ్గిరాజేస్తుండటంతో ఎన్డీయే నుంచి బయటకు వస్తారా అన్న ప్రశ్నకు నితీష్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఎన్డీయేలో కొనసాగుతామా లేక బయటకు వస్తామా అన్న చర్చ ఇప్పుడు అనవసరం అన్నారు. కేంద్రంతో మరోసారి కూర్చుని చర్చించుకుంటామని స్పష్టం చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చించుకుని ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది తయారు చేస్తామని వెల్లడించారు. అయితే కుల గణన చేపట్టాలన్న డిమాండ్ కేవలం బీహార్ రాష్ట్రందే కాదని ఇతర రాష్ట్రాలు సైతం ఈ డిమాండ్ను వినిపిస్తున్నాయని సీఎం నితీష్ కుమార్ గుర్తుచేశారు. ఇది దేశప్రయోజనం కోసమే అని చెప్పారు.
ఇక కేంద్రం నిర్ణయంపై నితీష్ కుమార్ మరోసారి రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారిస్తారని సమాచారం. ఆగష్టు 23వ తేదీన బీహార్లోని 10 పార్టీల నాయకులను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి కులగణన అంశంపై చర్చించారు. అయితే దీనిపై కేంద్రం కోర్టుకు క్లారిటీ ఇవ్వడంతో నితీష్ ఎలాంటి అడుగు తీసుకోనున్నారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే 2011 సామాజిక-ఆర్థిక-కులగణన వివరాలను కేంద్రం వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వగా... దీనిపై కేంద్ర సామాజిక సాధికారిత మంత్రిత్వ శాఖ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. 2011 సామాజిక-ఆర్థిక-కులగణన డేటాలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నందున ఆ సమాచారం నిరుపయోగంగా మారిందని అత్యున్నత న్యాయస్థానంకు తెలిపింది. 2011 చేపట్టిన కుల గణనలో తప్పులు ఉన్నాయని చెప్పడాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ తప్పుబట్టారు. ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన అవగాహన రావాలంటే అలాంటి గణాంకాలు తప్పనిసరి అని చెప్పారు.
కులగణన చేయడం వల్ల ఏ కులాలు ఇంకా వెనకబడి ఉన్నాయో తెలుస్తుందన్నారు. అలాంటి వెనకబడిన కులాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. 2011లో జరిగింది సామాజిక-ఆర్థి-కుల గణన అని.. ఒక్క కుల గణన కాదని స్పష్టం చేశారు. అది కూడా సరిగ్గా చేయలేదని రికార్డుల్లో పబ్లిష్ కూడా చేయలేదని గుర్తుచేశారు. కుల గణన చేస్తే విషయం మరింత స్పష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కుల గణనను సామాజిక-ఆర్థిక- కులగణన నివేదికతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించారు.
Recommended Video
ఇక కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో పలు అంశాలను చేర్చింది. ఓబీసీల జాబితాలో చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఓబీసీ కేటగిరీని తీసుకుంటే అందులో కొన్ని వందలు వేల సంఖ్యలో ఉపకులాలు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపింది. దీంతో కులం ఉపకులాలను వేరు చేయడం కష్టతరం అవుతుందని అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం అఫిడవిట్లో ఇచ్చిన సమాధానంపై నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కులగణన సమయంలో ఓ వ్యక్తి తన ఉపకులం గురించి కూడా చెబుతారని, అసలు ఉప కులం లేకుండా దేశంలో ఏదైనా కులం ఉందా అని నితీష్ ప్రశ్నించారు. ఇందుకోసమే కులగణన చేపట్టే వ్యక్తులకు ముందుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. కులం, ఉపకులం అన్నీ అందులో పొందుపర్చాలని డిమాండ్ చేశారు నితీష్ కుమార్.