తాళం తప్పనట్టే: లాక్డౌన్లో మరో స్టేట్: త్వరలో దేశం మొత్తం?
పాట్నా: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రావట్లేదు. మరోసారి మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల్లోనూ అదే ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3,449 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్ల మార్క్ను దాటేసింది.
ఈ పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కరోనా కట్టడికి ఇదివరకట్లా లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మళ్లీ మొదటికొస్తాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమౌతోంది. లాక్డౌన్పై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలను తీసుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది కేంద్రం. దీనితో ఒక్కో స్టేట్.. లాక్డౌన్లోకి జారిపోతున్నాయి. సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి.
ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, హర్యానా సంపూర్ణ లాక్డౌన్లోకి వెళ్లాయి. ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా పాక్షికంగా దీన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాత్రివేళ కర్ఫ్యూ విధించాయి. ఏపీలో బుధవారం నుంచి పాక్షిక లాక్డౌన్ అమల్లోకి రానుంది. తాజాగా- బిహార్ కూడా కంప్లీట్ లాక్డౌన్ను ప్రకటించింది. ఇప్పటిదాకా వీకెండ్లో మాత్రమే లాక్డౌన్ను అమలు చేస్తూ వచ్చిన నితీష్ కుమార్ ప్రభుత్వం.. దాన్ని మరింత విస్తరింపజేసింది. ఈ నెల 15వ తేదీ వరకు కంప్లీట్ లాక్డౌన్ను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఇంకాస్సేపట్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
कल सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ चर्चा के बाद बिहार में फिलहाल 15 मई, 2021 तक लाॅकडाउन लागू करने का निर्णय लिया गया। इसके विस्तृत मार्गनिर्देशिका एवं अन्य गतिविधियों के संबंध में आज ही आपदा प्रबंधन समूह (Crisis management Group) को कार्रवाई करने हेतू निदेश दिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 4, 2021
Recommended Video
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. మంత్రులతో చర్చించిన తరువాత.. వారి అభిప్రాయాల మేరకు లాక్డౌన్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. తాజా బులెటిన్ ప్రకారం బిహార్లో 11,407 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు అయిదు లక్షలను దాటాయి. 2,800 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. కరోనా కట్టడికి పూర్తిస్థాయి లాక్డౌన్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నితీష్ కుమార్ ట్వీట్ చేశారు.