కిడ్నాప్?: వైద్య దంపతులతోపాటు వారి ఆడి కారు అదృశ్యం
పాట్నా: బీహార్ రాష్ట్రంలో గత కొంతకాలంగా కనిపించని కిడ్నాప్ ముఠాల ఆగడాలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాజాగా గయాకు చెందిన ప్రముఖ డాక్టర్, అతని భార్య వారి ఆడి కారులో ప్రయాణిస్తున్న సమయంలో కిడ్నాప్ అయ్యారు. ఇటీవలే కొనుగోలు చేసిన ఆడి కారులో ప్రయాణిస్తున్న వారి కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు.
గయాలోనే ప్రముఖ పిడియాట్రిషియన్గా పేరున్న డాక్టర్ పంకజ్ గుప్తా, అతడి భార్య శుభ్రా గుప్తాలు శుక్రవారం జార్ఖండ్లోని గిరిధిలో వారి బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి గయాకు వస్తున్న సమయంలో కిడ్నాప్ అయ్యారు. ఈ ఘటన గత శుక్రవారం చోటు చేసుకుంది.
పంకజ్ గుప్తా సోదరుడు నీరజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గయ పోలీసులు కేసు నమోదు చేశారు. నీరజ్ కథనం ప్రకారం.. తన సోదరుడు, అతని భార్య శుక్రవారం ఉదయం 10గంటలకు గిరిధి నుంచి బయలుదేరారు. చివరిసారిగా అదేరోజు 1.30గంటలకు మాట్లాడారు. మధ్యాహ్నం 3గంటలకు ఇంటికి చేరాల్సి ఉండగా వారు రాలేదు. దీంతో వారి ఫోన్లకు కాల్ చేయగా, అవి స్విచ్ఛాఫ్ వచ్చాయని తెలిపారు.
కాగా, ఇప్పటి వరకు డాక్టర్ కుటుంబానికి డబ్బులు డిమాండ్ చేస్తూ ఎవరి వద్ద నుంచీ ఫోన్ కాల్స్ రాలేదు. డాక్టర్ గుప్తా ప్రయాణించిన మార్గంలో మావోయిస్టులతోపాటు దొంగల బెడద కూడా చాలా ఎక్కువని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను పంపినట్లు డిజిపి పికె థాకూర్ చెప్పారు. ట్రాఫిక్ సిసి కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.